ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే ఈ వివాదం రోజు రోజుకు హీట్ పుట్టిస్తుంది. మొన్న కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఏ పంట వరి పంట వేయోద్దని వరి విత్తనాలు అమ్మొద్దని హెచ్చరించారు. దీనిపై ప్రతిపక్ష నేతలు సైతం ఫైర్ అయ్యారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పై మండి పడ్డారు. రైతుల జోలికి వస్తే ఊరుకోమని కలెక్టర్ను హెచ్చరించారు. ఇదిలా ఉంటే తాజగా ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. గతంలో 2 కోట్ల టన్నులైనా ధాన్యం కొంటామన్నారు. ఇప్పుడు వరి వేయోద్దని అంటున్నారు. దీనిలో ఆంతర్యం ఏంటని ఎంపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఏడేళ్లలో ఎంత ధాన్యం ఎగుమతి చేశారో సీఎం కేసీఆర్ చెప్పాలన్నారు. బాయిల్డ్ రైస్ మాత్రమే కొనమని కేంద్రం చెప్పిందన్నారు. పుడ్ ప్రాసెసింగ్ పెంచుకుంటే కేంద్రం 80శాతం సబ్సీడీ ఇస్తుందన్నారు. వరి అమ్మకపోతే గంజాయి విత్తనాలు అమ్మాలా..? అంటూ అరవింద్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో టీఆర్ఎస్ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఎంపీ అరవింద్ అన్నారు. ఏ పంట వేయాలో నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు.