తూర్పుగోదావరి జిల్లాలో ఓ వైసీపీ నేత ఓ మహిళా ఉద్యోగి పట్ల వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినవిల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ఛాంబర్ లోనే ఒక దళిత ఎంపీడీవో పై ఏకవచనంతో రెచ్చిపోయారు నేదునూరు పెదపాలెం మాజీ సర్పంచ్, వైసీపీ నాయకుడు వాసంశెట్టి తాతాజీ.
ఎంపీడీవో నచ్చకపోతే పంపించేయండి అని అంటే సరిగ్గా చేయకపోతే చీరేస్తానని వైసీపీ నాయకుడు బెదిరించడం కలకలం రేపుతోంది. కె.జగన్నాధపురం గ్రామంలో ముగ్గురు వాలంటీర్ల తొలగింపు, స్థానిక జడ్పీటీసీ ప్రొటోకాల్ విషయంలో గత కొన్ని రోజులుగా ఎంపీడీవో అధికారిని టార్గెట్ చేశారు వైసీపీలోని కొందరు నాయకులు.
తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ వైసీపీలోని కొందరు తనను టార్గెట్ చేస్తూ తీవ్ర మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎంపీడీవో ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో కొంతమంది వైసీపీ నేతల మాట ఆమె వద్ద చెల్లకపోవడంతో గత కొన్ని నెలలుగా ఎంపీడీవో పై ఆ నేతలు కక్ష గట్టి లేనిపోని ఆరోపణలు చేస్తున్నట్లు పలు విమర్శలు వస్తున్నాయి.