మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సొంత పార్టీకి చెందిన మహిళా నేతే ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్గా మారిపోయింది… తననూ, తన కుమారులను చంపుతానని ఎమ్మెల్యే ఫోన్లో బెదిరించారని ఆవేదన వ్యక్తం చేసిన టీఆర్ఎస్ మహిళా నేత పద్మా రెడ్డి… ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై మంచిర్యాల ఏసీపీకి ఫిర్యాదు చేశారు.. ఎమ్మెల్యే తనకు ఫోన్ చేసి బూతులు తిట్టాడని ఆరోపించిన ఆమె.. నా ఇద్దరు కుమారులను, నన్ను చంపేస్తానని ఎమ్మెల్యే చిన్నయ్య వార్నింగ్ ఇచ్చాడనీ.. తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదులో ఏసీపీ దృష్టికి తీసుకెళ్లారు..
అయితే, బెల్లంపల్లి మున్సిపాలిటీ లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై అమెరికాలో ఉండే తన కొడుకు.. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్కు ఫిర్యాదు చేశారని.. ఇది మనసులో పెట్టుకున్న ఎమ్మెల్యే తననూ.. తన కొడుకునలు చంపేస్తానని బెదిరించారని ఆరోపిస్తున్నారు టీఆర్ఎస్ మహిళా నేత పద్మారెడ్డి.. గతంలో కూడా ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు ఇదే తరహాలో బెదిరించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మరో వివాదంలో చిక్కుకున్నట్టు అయ్యింది. సొంత పార్టీ నేతలనే ఈ తరహాలో బెదిరిస్తున్న ఎమ్మెల్యే.. ఇక, ఇతరుల పట్ల ఏ విధంగా ఉంటారో అర్థం చేసుకోవచ్చు అంటున్నాయి ప్రతిపక్షాలు.