మధురామృతానికి మారు పేరు మహ్మద్ రఫీ గానం.
యావద్భారతాన్నీ రఫీ పాట పరవశింప చేసింది. ఇంకా ఆనందసాగరంలో మునకలు వేయిస్తూనే ఉంది. రఫీ పాటకు తెలుగు సినిమాకు కూడా అనుబంధం ఉంది. తెలుగులోనూ మహ్మద్ రఫీ పంచిన మధురామృతం ఈ నాటికీ ఆనందం పంచుతూనే ఉండడం విశేషం.
పంజాబ్ లోని కోట్లా సుల్తాన్ సింగ్ అనే ఊరిలో మహ్మద్ రఫీ 1924 డిసెంబర్ 24న జన్మించారు. బాల్యంలో తమ ఊరిలో ఫకీర్లు తిరుగుతూ పాడే పాటలను వల్లిస్తూ ఉండేవారు రఫి. 1935లో ఆయన తండ్రి అలీ మొహమ్మద్ లాహోర్ కు మకాం మార్చారు. అక్కడే చిన్నారి రఫీలోని అసలైన గాయకుడు బయటపడ్డాడు. ఉస్తాద్ అబ్దుల్ వహీద్ ఖాన్ వద్ద సాధన చేశాడు. నాటి మేటి గాయకుడు కె.ఎల్.సైగల్ ను అనుకరిస్తూ పాటలు పాడేవారు రఫి. సైగల్ సూచనలతో కొన్ని మెలకువలు తెలుసుకొని ముందుకు సాగారు రఫి. 1945లో రూపొందిన ‘గావోంకీ గోరీ’ చిత్రంలో రఫీ తొలిసారి పాడారు. ఆయనలోని అసలైన గాయకుణ్ణి లోకానికి పరిచయం చేసిన ఘనత నిస్సందేహంగా సంగీత దర్శకులు నౌషాద్ కే దక్కుతుంది. నౌషాద్ స్వరకల్పనలో రూపొందిన ‘బైజూ-బావ్రా’తో రాత్రికి రాత్రి మహ్మద్ రఫీ గాయకుల్లో సూపర్ స్టార్ అనిపించుకున్నారు. నాటి నుంచీ హిందీ చిత్రసీమలో మహ్మద్ రఫీ గానం జైత్రయాత్ర చేసింది.
తెలుగువారికి మహ్మద్ రఫీ పేరు వినిపించగానే చప్పున నటరత్న యన్టీఆర్ కు ఆయన పాడిన సినిమాలు గుర్తుకు వస్తాయి. అయితే తెలుగులో మహ్మద్ రఫీతో తొలిసారి పాట పాడించినది నటనిర్మాత జగ్గయ్య. ఆయన సమర్పణలో తెరకెక్కిన ‘పదండి ముందుకు’లో “మంచికి కాలం తీరిందా…” అనే పాటను రఫీ పాడారు. ఇదే రఫీ పాడిన తొలి తెలుగు పాట. ఆ తరువాత చిత్తూరు నాగయ్య తన ‘భక్త రామదాసు’లో కబీర్ పాత్ర ధారి అయిన గుమ్మడికి రఫీతోనే హిందీ పాట పాడించడం విశేషం. ఈ సినిమాల తరువాత యన్టీఆర్ ‘భలే తమ్ముడు’లో రఫీ తెలుగు పాటలు పాడి జనాన్ని పరవశింప చేశారు. హిందీ ‘చీనా టౌన్’ ఆధారంగానే ‘భలే తమ్ముడు’ రూపొందింది. అక్కడ కూడా రఫీ పాటలే చిత్రానికి ప్రాణం పోశాయి. దాంతో తెలుగులోనూ రఫీతోనే పాడించారు నిర్మాత పుండరీకాక్షయ్య. ‘భలే తమ్ముడు’తోనే తెలుగునాట రఫీ పాట పరవళ్ళు తొక్కిందని చెప్పాలి. ఇందులో రఫీ గళంలో జాలువారిన “ఎంతవారు గానీ వేదాంతులైన గానీ…”, “ఇద్దరి మనసులు ఒకటాయె…”, “నేడే ఈ నాడే మురిపించె నన్ను చెలితానే..”, “గుమ్మా గుమ్మా గుమ్మెత్తించే ముద్దుల గుమ్మా…”, “బడా దిల్ వాలా హూ మై…” అనే ఖవ్వాలీ ఎంతగానో అలరించాయి.
తరువాత తెలుగులో యన్టీఆర్ తో అనుబంధం ఉన్న చిత్రాలలోనే రఫీ పాటలు పాడడం విశేషం. యన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన ‘తల్లా పెళ్ళామా’లో “నువ్వు నవ్వుతున్నావు…నేను నవ్వుతున్నాను…” అనే ఖవ్వాలీ సాంగ్ పాడించారు. తరువాత యన్టీఆర్ తనయులు హరికృష్ణ, బాలకృష్ణ నటించిన “రామ్ – రహీమ్”లో హరికృష్ణకు నేపథ్యం పాడారు రఫి. అందులోని “యూనానీ హకీమ్ హూ…”, “నేను కత్తుల రత్తయ్యనులే…” పాటలు పాడారు. తరువాత యన్టీఆర్ తో పుండరీకాక్షయ్య నిర్మించిన ‘ఆరాధన’ చిత్రంలో మరోమారు రామారావుకు రఫీ నేపథ్యగానం చేసి మురిపించారు. ఇందులోని “ప్రియతమా… నా మది నిన్ను పిలిచింది…”, “నేడే తెలిసింది… ఈ నాడే తెలిసింది…”, “నీకేల ఇంత నిరాశ…” పాటలు పాడి ఎంతగానో అలరించారు. ఆపై యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించి, నటించిన ‘అక్బర్ సలీమ్ అనార్కలి’లో సలీమ్ పాత్రధారి బాలకృష్ణకు అన్ని పాటలూ రఫీతోనే పాడించారు. ఇందులోని మహ్మద్ రఫీ పాడిన “తారలెంతగా మురిసేనో…”, “తానే మేలి ముసుగు తీసి…”, “హసీనా… ఓ హసీనా…”, “రేయి ఆగిపోనీ…రేపూ ఆగిపోనీ..” పాటలు విశేషాదరణ చూరగొన్నాయి. యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన ‘శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం’లో సత్యనారాయణ పాత్రకోసం “దేవుడు ఒకడే ఆ దైవం ఒకడే…” పాటను పాడారు రఫీ. ఇదే ఆయన చివరగా పాడిన తెలుగు పాట. ఏది ఏమైనా మహ్మద్ రఫీ గళంలో జాలువారిన గానానికి తెలుగువారు ఎంతగానో పులకించిపోయారు. ఆయన పాడిన తెలుగు పాటలనే కాదు, హిందీ గీతాలనూ అదే స్థాయిలో అభిమానించి, ఆరాధించారు జనం.