టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిననాటి నుంచి వీసీ సజ్జనార్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. టీఎస్ఆర్టీసీలో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తున్న ప్రయాణికుల సమస్యలు క్షణాల్లోనే తీర్చతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా ఓ యువతి అర్థరాత్రి టీఎస్ఆర్టీసీ, ఎండీ సజ్జనార్ను ట్యాగ్ చేస్తూ ట్విట్ చేసింది. దీంతో సజ్జనార్ వెంటనే స్పందించారు. అయితే అర్ధరాత్రి సమయాలలో ఆర్టీసీ బస్సులలో మహిళల సౌకర్యం కోసం (వాష్ రూమ్స్) బస్సులను పెట్రోల్ పంప్లలో 10 నిమిషాలు ఆపాలని పాలే నిషా అనే యువతి ట్విట్టర్ వేదికగా కోరింది.

దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే మహిళలు ఇబ్బందులు పడుతున్నారని యువతి తెలిపింది. దీంతో వెంటనే ఈ విషయం పై అధికారులకు సూచించినట్లు సజ్జనార్ రిప్లై ఇచ్చారు. అర్ధరాత్రి సైతం మహిళ సమస్యపై సజ్జనార్ స్పందించడంతో పాలే నిషా ఆనందం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపింది. నిషాతో పాటు నెటిజన్లు సైతం సజ్జనార్ స్పందించిన తీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.