రాజ్ కుంద్రా ఉదంతంలో శిల్పా ఎదుర్కొంటోన్న చిక్కులు అన్నీ ఇన్నీ కావు. ఒకవైపు పోలీసుల దర్యాప్తులు, కోర్టుల విచారణలే కాక మరో వైపు మీడియా, సొషల్ మీడియా రాద్ధాంతం ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. అందుకే, శిల్పా భర్త అరెస్ట్ తరువాత మొదటిసారి విపులంగా స్పందించింది. వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి తాను ఏం మాట్లాడనని మరొక్కమారు తేల్చి చెప్పిన మిసెస్ కుంద్రా ముంబై పోలీస్, భారతీయ న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని పేర్కొంది. తాను అనని మాటల్ని ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేసింది. అన్నిటికంటే ముఖ్యంగా, ఒక తల్లిగా తన పిల్లల కోసం అభ్యర్థిస్తున్నానన్న శిల్పా… ‘ప్రైవెసీ’కి విలువ ఇవ్వండంటూ కోరింది. మీడియా తప్పుడు కథనాలు, సొషల్ మీడియా ట్రోలింగ్ ని ఆమె ఖండించింది.
శిల్పా శెట్టి సొషల్ మీడియాలో స్పందించటంతో చాలా మంది సినీ సెలబ్స్ ఆమెకు అండగా కామెంట్స్ చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెబుతూనే మీడియా ట్రయల్, ట్రోలింగ్ లాంటివి మంచిది కాదని అందరూ అభిప్రాయపడ్డారు. ”నువ్వు అత్యంత శక్తివంతమైన దానివి” అన్నాడు మాధవన్. శిల్పా తప్పకుండా అన్ని సవాళ్లని గంభీరంగా ఎదుర్కుంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇక నటి రిచా చద్దా ”మగవాళ్లు చెసే తప్పులకి ఆడవాళ్లని నిందించటం మనకు ఆటగా మారింది. అలాంటి వార్ని శిల్పా కోర్టుకు ఈడుస్తుండటం సంతోషించాల్సిన విషయం… ”అంది. మాధవన్, రిచా చద్దా మాత్రమే కాదు షమితా శెట్టి, హన్సల్ మెహతా, వరుణ్ ధావన్, జాక్విలిన్ ఫెర్నాండెజ్, గౌహర్ ఖాన్, అభిమన్యు దస్సాని, మాహీ విజ్, అనిరుధ్ దవే… ఇలా చాలా మంది శిల్పాకు మద్దతుగా నిలిచారు.
శిల్పా శెట్టి ఒకవైపు మీడియా, సొషల్ మీడియాను మౌనంగా భరిస్తూనే మరోవైపు భర్త రాజ్ కుంద్రా విడుదల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఆయన ఇంకా జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నాడు.