ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి.. తెలుగు రాష్ట్రాల పాలిట గండంగా తయారైంది. ఇప్పటికీ భారీ నుంచి అతి భారీ వర్షాలతో ఏపీని అతలాకుతలం చేస్తున్న వరుణుడు.. తెలంగాణను సైతం వదలనంటున్నాడు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో రాగల 48 గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే ఇప్పటికే శుక్రవారం నుంచి తెలంగాణ వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి.
Also Read: శ్రీవారి భక్తులకు శుభవార్త.. తెరుచుకున్న రెండు ఘాట్ రోడ్లు.. కానీ
మొన్నటి నుంచి హైదరాబాద్కు బైబై చెప్పిన భానుడు తెలంగాణలో అక్కడక్కడ తొంగి చూస్తున్నాడు. అకాల వర్షాల కారణంగా పలు జిల్లాల్లో పంటలు నీట మునిగిపోయాయి. దీంతో రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నారాయణపేట, కామారెడ్డి, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, ఖమ్మం, సంగారెడ్డి, భువనగిరి లతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను వాతావరణ శాఖ జారీ చేసింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.