గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలను తీసుకవచ్చిన విషయం తెలిసిందే. అయితే చట్టాలు ఆమోదయోగ్యంగా లేవంటూ ఇటు ప్రతిపక్షాలు, అటు రైతులు దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా దేశ రాజధాని ఢిల్లీలో సంవత్సరం పాటు రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకొని 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
అయితే నేడు శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ వ్యవసాయ చట్టాల బిల్లును రద్దు చేశారు. దీనిపై కాంగ్రెస్ అధినేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పందిస్తూ.. వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవలసి ఉంటుందని గతంలో మేము చెప్పామని ఆయన అన్నారు. నేడు ఈ చట్టాలు రద్దు చేయబడ్డాయని కానీ వ్యవసాయ చట్టాలను చర్చించకుండానే రద్దు చేయడం విచారకరమని ఆయన అన్నారు. అంతేకాకుండా చర్చకు ఈ ప్రభుత్వం భయపడుతోందని ఎద్దేవా చేశారు.