వైసీపీ నేతల మధ్య ఆధిపత్యపోరు పెరిగిపోతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అధికార పార్టీ నేతల మధ్య చీలిక.. విమర్శ, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు నేతలు. వైఎస్సార్ పెన్షన్ కానుక సాక్షిగా విభేదాలు బయటపడ్డాయి. ఈ నెల 2న తణుకులో వైఎస్సార్ పెన్షన్ కానుక ప్రారంభించారు MSME డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంకా రవీంద్ర నాధ్, తణుకు వైసీపీ టౌన్ ప్రెసిడెంట్ తమ్ముడు సాయి రాం రెడ్డి.
ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు తాను లేకుండా కార్యక్రమాలు ఎలా చేస్తారని టౌన్ ప్రెసిడెంట్ యెస్ యెస్ రెడ్డి ని నిలదీశారు. తమ్ముడూ వెన్నుపోటు రాజకీయం చేస్తున్నావా అని ఎస్ఎస్ రెడ్డిని నిలదీశారు ఎమ్మెల్యే. ఆ సందర్భంలోనే తల్లిని ఉద్దేశించి తిట్టారని అంటున్నారు. దీంతో తనను బూతులు తిట్టారంటూ తణుకు టౌన్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు ఎస్ఎస్ రెడ్డి. తణుకు పింఛన్ పంపిణీ కార్యక్రమంలో దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు కారుమూరి నాగేశ్వరరావు.
సీఎంని తీసుకు వచ్చి బర్తడే చేశాను అదే నాకొంప ముంచింది. అర్జంటుగా ఒక వ్యక్తి ఎమ్మెల్యే అయిపోవాలి నేను దిగిపోవాలి అని కోరుకుంటున్నాడు. ఎదురుగుండా వచ్చే వాడితో పోరాడవచ్చు.. వెనుక నుండి పొడిచేస్తున్నారు. జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా పనిచేశాను . నేను ఎవరికీ అపకారం చేయలేదు శత్రువుకి కూడా ఉపకారంచేశానన్నారు ఎమ్మెల్యే కారుమూరి. నేను ఎవరినో కొట్టించేస్తానని నావల్ల ప్రాణహాని ఉందని ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.