చారిత్రాత్మక మక్కా మసీదులో చేపట్టిన మరమ్మతులు, పునరుద్దరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రంజాన్లోపు పనులు పూర్తి చేయాలని మైనారిటీ సంక్షేమ శాఖ హెరిటేజ్ శాఖను కోరింది. 17వ శతాబ్దపు మసీదు మరమ్మతు పనులను 2017లో అధికారులు ప్రారంభించారు. తొలుత 18 నెలల గడువును అధికారులు నిర్దేశించగా వివిధ కారణాలతో ఇప్పటి వరకు 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ. 8 కోట్లు మంజూరు చేసింది. వారసత్వ కట్టడాల పరిరక్షణ పనులను చేపట్టే ప్రముఖ సంస్థల నుండి టెండర్లు పిలిచింది.
ముంబైకి చెందిన రెండు సంస్థలు పరిరక్షణ ప్రయత్నాలలో చేరినప్పటికీ, అమలుకు సంబంధించిన కొన్ని సమస్యల కారణంగా, ఒక సంస్థ వెనక్కి తగ్గిందని మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ హెరిటేజ్ శాఖ పరిరక్షణ పనులను పర్యవేక్షిస్తూ.. మైనారిటీ సంక్షేమ శాఖ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), ఇతర ఏజెన్సీల స్థానిక అధికారులతో సమన్వయం చేస్తోంది. రాజ కుటుంబ సభ్యుల సమాధులు ఉండే ‘మక్బరా’ మరమ్మతు పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, మసీదు ప్రధాన హాలు పనులు ఇంకా పూర్తి కాలేదని అధికారులు వెల్లడించారు.
ప్రధాన ద్వారం, గేట్వే పునరుద్ధరణ కూడా గతేడాది పూర్తయిందని తెలిపారు. గత నాలుగేళ్లుగా పనులు నత్తనడకన సాగుతున్నాయని, కాంట్రాక్టర్, నిధులు, ఇటీవల కోవిడ్ మహమ్మారి వంటి పలు సమస్యల కారణంగా పురోగతి మందగించిందని టీఎస్ వక్ఫ్ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం మసీదు ప్రధాన హాలులో పనులు కొనసాగుతున్నాయని మక్కా మసీదు సూపరింటెండెంట్ అబ్దుల్ ఖదీర్ సిద్ధిఖీ తెలిపారు.