బద్వేల్ ఉప ఎన్నిక ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. మరో నాలుగు రోజుల్లో ప్రచారం ముగియనుండగా అక్టోబర్ 30న పోలింగ్ జరుగనుంది. బద్వేల్ లో వైసీపీ గెలుపు ఏకపక్షంగానే కన్పిస్తుండటంతో ఆపార్టీ భారీ మోజార్టీపై గురిపెట్టింది. అందుకు తగ్గట్టుగానే వైసీపీ శ్రేణులు నియోజకవర్గంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని నేతలంతా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే టీడీపీ తమ్ముళ్లు మాత్రం ఎవరికీ ఓటు వేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు.
బద్వేల్ ఉప ఎన్నిక అనివార్యమైనప్పటీ నుంచే టీడీపీ ఇక్కడ రేసులో ఉంది. వైసీపీ తన అభ్యర్థిని ప్రకటించక ముందే టీడీపీ అభ్యర్థిని ప్రకటించింది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి దాదాపు 50వేల ఓట్లు వచ్చాయి. దీంతో ఈసారి ముందుగానే టీడీపీ అభ్యర్థి బద్వేల్ నియోజవకర్గంలో ప్రచారాన్ని చేపట్టారు. అయితే అనుహ్యంగా టీడీపీ బద్వేల్ ఉప ఎన్నిక నుంచి తప్పుకొని టీడీపీ తమ్ముళ్లకు షాకిచ్చింది. మరోవైపు పోలింగ్ సమయం దగ్గరపడుతున్నప్పటికీ టీడీపీ అధిష్టానం ఏ పార్టీకి మద్దతు ఇస్తుందనే అంశంపై క్లారిటీ ఇవ్వడం లేదు.
వైసీపీ తన అభ్యర్థిగా చనిపోయిన బద్వేల్ ఎమ్మెల్యే భార్య పేరునే ప్రకటించింది. సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో వైసీపీ గెలుపు ఏకపక్షమనేనే ప్రచారం జరుగుతోంది. కడప జిల్లాలో వైసీపీ బలంగా ఉండటంతో జనసేన సైతం పోటీ నుంచి తప్పుకుంది. రాజకీయ సంప్రదాయాలను గౌరవిస్తూ తాము ఈ ఎన్నికల నుంచి తప్పుకున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆ వెంటనే టీడీపీ సైతం ఉప ఎన్నికల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చారు.
ఈ నేపథ్యంలో బద్వేల్ ఉప ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అంతా భావించారు. అయితే అనుహ్యంగా కాంగ్రెస్, బీజేపీ బరిలో నిలిచాయి. ఈ పరిస్థితుల్లో ఓటింగ్ తప్పనిసరిగా మారింది. అయితే టీడీపీ పోటీ నుంచి తప్పుకోవడం ఇక్కడ ఆపార్టీ జెండా కూడా కన్పించడం లేదు. జనసేన పోటీ నుంచి తప్పుకున్నప్పటికీ బీజేపీకి మద్దతు ఇస్తున్న కారణంగా ఆపార్టీ జెండాలు ఇక్కడ రెపరెపలాడుతున్నాయి. ఆఖరికి కాంగ్రెస్ జెండా లు కన్పిస్తున్నాయి కానీ టీడీపీ జెండా మాత్రం కన్పించడం లేదు. దీనంతటికీ చంద్రబాబు నిర్ణయమే కారణమని తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ తేదికి సమయం దగ్గర పడుతున్నా అధిష్టానం ఇంకా ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో ఇంకా తేల్చుకోలేక పోతుంది.
ఇక బీజేపీకి టీడీపీ ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చే అవకాశం లేదు. అలాగని కాంగ్రెస్ కు సైతం లోపాయికారిగా సహకారం అందించడం లేదు. దీంతో టీడీపీ ఓటర్లు ఎవరికీ ఓటు వేయాలో తేల్చుకోలేక సతమతవుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే మాత్రం టీడీపీ ఓటు బ్యాంకు సైతం అధికార పార్టీ ఖాతాలో పడటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. వైసీపీకి భారీ మెజార్టీ వస్తే మాత్రం అది మళ్లీ టీడీపీకే మైనస్ గా మారనుంది. దీంతో టీడీపీ తమ ఓటు బ్యాంకును ఎటువైపు మళ్లిస్తుందనేది మాత్రం ఆసక్తిని రేపుతోంది.