కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రంపంచదేశాలను వణికిస్తోంది.. భారత్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మహమ్మారి.. తెలంగాణలోనూ వెలుగు చూసింది.. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి తెలంగాణలో అడుగుపెట్టిన ఒమిక్రాన్ ఇప్పుడు టెన్షన్ పెడుతోంది.. క్రమంగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరుగుతూ పోతున్నాయి.. ఓవైపు డెల్టా వేరియంట్ కేసులు పూర్తిస్థాయిలో తగ్గిపోకముందే.. ఇప్పుడు ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తోంది.. అయితే, ఒమిక్రాన్ కట్టడికి క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర హైకోర్టు..
తెలంగాణలో కోవిడ్ పరిస్థితులపై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు.. ఒమిక్రాన్ వైరస్ తీవ్రత దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల్లో జనం గుంపులు గుంపులుగా గుమికూడకుండా ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.. ప్రభుత్వం రెండు, మూడు రోజుల్లోగా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్న హైకోర్టు.. ఎయిర్పోర్ట్లో ఉన్న విధంగానే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలకు తగిన పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం మరియు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అయితే కోవిడ్ నిబంధనలను విధించారో.. అదే రీతిలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొంది హైకోర్టు.