నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి… గంటకు 27 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతున్న వాయుగుండం.. చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 300 కిలోమీటర్లు, పుదుచ్చేరికి తూర్పు-ఆగ్నేయంగా 280 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది.. కారైకాల్ – శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తుండగా.. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.. నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్నారు అధికారులు..
Read Also: వాయుగుండం ఎఫెక్ట్.. తమిళనాడు సర్కార్ అత్యవసర ఉత్తర్వులు
ఇక, మరోవైపు నెల్లూరు, చిత్తూరు జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షం కురుస్తోంది.. తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది.. దీంతో పంబలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.. స్వర్ణముఖి బ్యారేజ్ కి భారీగా వరదనీరు చేరుతోంది.. రెండు గేట్లను ఎత్తి 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. మరోవైపు.. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు.. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా చేశారు.. అటు చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.. జిల్లా వ్యాప్తంగా మరికొన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది.. దీని కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. భీమా, స్వర్ణముఖి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.. కళ్యాణి డ్యామ్ నీటిమట్టం క్రమంగా పెరుగుతుండగా.. మరో 10 అడుగుల నీటిమట్టం పెరిగితే గేట్లు తెరిచే అవకాశం ఉంది.. మరోవైపు.. రామిరెడ్డి పల్లి, కొటాల, పులిత్తివారి పల్లెలో వరద ఉధృతి కారణంగా రోడ్లు కొట్టుకుపోయాయి.. దీంతో.. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.. దుర్గం, వైకుంఠపురం ఎస్టీ కాలనీలు నీటమునిగినట్టు స్థానికులు చెబుతున్నారు.
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపింలేకుండా కురుస్తున్న వర్షాలు.. తీరంలో ముందుకు దూసుకొస్తుంది సముద్రం.. తీరం వెంబడి అలలు ఎగసి పడుతున్నాయి.. అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.. అప్రమత్తం అయిన జిల్లా యంత్రాగం.. ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆదేశాలు జారీ చేశారు.. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించేలా చర్యలు చేపట్టాలన్నారు.. లోతట్టు ప్రాంతాలను, నీట మునిగే ప్రాంతాలను గుర్తించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని సూచించిన ఆయన.. ప్రజలు త్రాగునీటికి ఇబ్బందిపడకుండా చూడాలని ఆదేశించారు.. ఇక, ఎమ్మార్వో, ఆర్డీవో కార్యాలయాల్లో కాల్ సెంటర్ లు ఏర్పాటు చేశారు.. కంట్రోల్ రూమ్ నెంబర్ 1077గా ప్రకటించారు.. నిన్న అత్యధికంగా నాయుడుపేటలో 40 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. అత్యల్పంగా పొదలకూరులో 12.5 మిల్లీ మీటర్ల వర్షం నమోదైంది.. భారీ వర్షాల నేపథ్యంలో.. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అధికారులు.