తెలంగాణలో కరెంట్ ఛార్జీలు భారీగా పెరగనున్నాయి. డిస్కంలు సమర్పించిన ఏఆర్ఆర్లు(వార్షిక ఆదాయ అవసరాలు) ఈ అంశాన్ని సూచిస్తున్నాయి. విద్యుత్ డిస్కంలు 2021-22, 2022-23 సంవత్సరాలలో ఆదాయ, వ్యయాలకు సంబంధించిన ఏఆర్ఆర్ ప్రతిపాదనలను మంగళవారం విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి సమర్పించాయి. ఈ సందర్భంగా తాము రూ.21,550 కోట్ల రెవెన్యూ లోటును కలిగి ఉన్నామని.. దీనిని పూడ్చాలంటే విద్యుత్ ఛార్జీలు పెంచక తప్పదని ప్రతిపాదనల్లో డిస్కంలు స్పష్టం చేశాయి. 2021-22 కాలానికి రూ.45,618 కోట్ల లోటు, 2022-23 కాలానికి రూ.53,053 కోట్ల లోటు ఉండగా.. ఆదాయం, ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ పోనూ ఇంకా లోటులోనే ఉన్నామని డిస్కంలు పేర్కొన్నాయి.
Read Also: ఆరు నెలల్లో అందుబాటులోకి చిన్నారులకు వాక్సిన్
ఈ నేపథ్యంలో టారీఫ్ ఛార్జీలు ప్రకటించిన తర్వాత పబ్లిక్ హియరింగ్ నిర్వహించి కరెంట్ ఛార్జీల పెంపుకు అనుమతిస్తామని ఈఆర్సీ తెలిపింది. డిస్కంలకు నష్టాలు క్రమంగా పెరుగుతుండటంతో ఛార్జీల పెంపు కోసం సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గత ఐదేళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచకపోవడంతో ఆ భారాన్ని ఒకేసారి ప్రజలపై మోపాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఎవరికి ఎంత భారం వేయాలనేది డిస్కంలకు ప్రశ్నార్థకంగా మారింది. అందుకే ఏఆర్ఆర్ రిపోర్ట్లో ఛార్జీలపై స్పష్టమైన టారిఫ్ ఇవ్వలేదని తెలుస్తోంది. టారిఫ్ ఛార్జీలు ప్రకటించిన అనంతరం వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి కరెంట్ ఛార్జీలను ప్రభుత్వం పెంచనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇళ్లతో పాటు, కమర్షియల్, ఇండస్ట్రియల్ కేటగిరీలకు కూడా కరెంట్ ఛార్జీలు పెరగనున్నాయి.