తెలుగురాష్ట్రాల్లో పెరిగిపోతున్న సైబర్ నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు సైబర్ నేరాలు, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న నేరాల కట్టడి/నియంత్రణకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో అత్యాధునిక సైబర్ సెల్, సోషల్ మీడియా ల్యాబ్స్ త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్. మనిషి జీవితంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంత విలువైందో అందరికీ తెలిసిన విషయమే. అదే తమకు అనుకూలంగా మార్చుకొని కొంతమంది మోసగాళ్ళు అమాయకులను సాధారణ వ్యక్తి మొదలుకొని అత్యంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తిని సైతం వదలకుండా బురిడీకొట్టిస్తూ అనేక రకాలుగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.
లాటరీ మెయిల్స్, వ్యక్తిగత స్వేచ్ఛకు ముప్పు, సెల్ ఫోన్ల లావాదేవీలపై కన్ను, భద్రతా పరమైన నేరాలపై గోప్యత, OTP మోసాలు, కోవిడ్ టీకా సంబంధిత మోసాలు, ఆధర్ అనుసంధానం, బీమా సంస్థల పేరుతో మోసాలు, ప్రభుత్వ పథకాల పేర్లతో మోసాలు, BIT Coin మోసాలు, చిన్నారులు, మహిళలు, గృహిణుల పట్ల అసభ్య పదజాలంతో వ్యక్తిగత దూషణలు, విచ్చలవిడిగా మర్ఫెడ్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం వంటి అనేక నేరాలకు పాల్పడుతున్నారని డీజీపీ అన్నారు.
ఇలాంటి మోసాలను నియంత్రించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన Cyber Crime Investigation Tools, Disk Forensics Tools, Mobile Forensic Tools, Password Recovery Tools, CDR Analysis Tools, Image Enhancement Tools, OS INT Tools, Proxy server Identity Tools, E-mail Tools, Social media Tools తో కూడిన సైబర్ సెల్, సోషల్ మీడియా ల్యాబ్స్ ను త్వరలోనే ఏర్పాటు చేస్తున్నాం అని డీజీపీ తెలిపారు. వీటికి ఫోరెన్సిక్ వర్క్ స్టేషన్, లాప్ టాప్, హై ఎండ్ కంప్యూటర్ వంటి ఆధునిక హార్డ్ వేర్ ను అందించడం జరుగుతుంది. అందులో విధులు నిర్వహించేందుకు సైబర్ ల్యాబ్స్, సోషల్ మీడియా ల్యాబ్స్ కు వేర్వేరుగా B.tech విద్య అర్హత కలిగి పరిజ్ఞానం కలిగిన 1 ఎస్ఐ, 5 పోలీస్ కానిస్టేబుళ్ళని ఎంపిక చేయడం జరిగింది. త్వరలోనే ప్రతి జిల్లా కు సాంకేతిక పరంగా న్యాయ సలహాల కోసం సైబర్ లీగల్ అడ్వయిజర్, సైబర్ నిపుణుల నియామకాన్ని చేపట్టడం జరుగుతుంది.
వీరికి మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని ఆన్ లైన్ ద్వారా పోలీసు ప్రధాన కార్యాలయం నుండి ప్రారంభించారు. మొదటి విడతలో భాగంగా PTC విజయనగరం లో 100 , PTC ఒంగోలులో 100, PTC అనంతపురంలో 100 మందికి శిక్షణ పొందుతారు. మొత్తం 20,000 మందిని ఎంపిక చేసి విడతలవారీగా సైబర్ క్రైమ్ నేరాల నియంత్రణ, సోషల్ మీడియా నేరాల నియంత్రణపై అత్యంత అనుభవం కలిగిన సుశిక్షితులైన వారిచేత శిక్షణ ఇప్పిస్తామంటున్నారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో సిబ్బందితో పాటు రాష్ట్రంలోని డిఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, ఎస్పీలు పాల్గొంటారని డీజీపీ పేర్కొన్నారు. జిల్లా స్థాయిలోని సైబర్ సెల్, సోషల్ మీడియా ల్యాబ్స్ ను అనుసంధానం చేస్తూ రాష్ట్ర స్థాయి లో సైబర్ సెల్, సోషల్ మీడియా ల్యాబ్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు. అందుకు కావల్సిన నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన సైబర్ సెల్, సోషల్ మీడియా ల్యాబ్ ద్వారా జిల్లా స్థాయి సిబ్బందికి అత్యంత నిపుణులు అయిన వారి చేత సూచనలు సలహాలను అందిస్తూ కేసు దర్యాప్తులో ఉత్పన్నమయ్యే సమస్యలకు పరిష్కారాలు చూపుతూ నిరంతరం వారి పనితీరును పర్యవేక్షిస్తుంది. అంతే కాకుండా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న 1551 మంది ప్రొ ఫైల్ లను గుర్తించి వారందరి పైన సైబర్ బుల్లి షీట్స్ ఓపెన్ చేయడంతో పాటు ప్రతి క్షణం వారి కదలికల పైన నిఘా కొనసాగుతుందని డీజీపీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.