NTV Telugu Site icon

Mlc Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు.. సీఈసీకి చంద్రబాబు లేఖ

Babu 1

Babu 1

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల వేళ భారీగా ప్రలోభాల పర్వం కొనసాగింది. ముఖ్యంగా అధికార పార్టీపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని చోట్ల ఓటుకు ఐదు, ఆరు వేలు ఇచ్చేందుకు కూడా వెనక్కు తగ్గలేదని ప్రచారం ఉంది. కొన్ని చోట్ల డబ్బులు పంచుతుండగానే.. ప్రత్యర్థి పార్టీలు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా.. చర్యలు లేవని ఆరోపణలు ఉన్నాయి. ఓ వైపు ఓటర్ల జాబితాలో అవకతవకలు.. మరోవైపు ప్రలోభాలపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Also Read:Minister Seediri: విశాఖే రాజధాని నో డౌట్.. సీఎం జగన్ గొప్ప పాలసీ
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలపై సీఈసీకి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఎన్నికల్లో పలు అక్రమాలను, ఉల్లంఘనలకు వివరించి తక్షణ చర్యలు కోరారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని YSRCP తీవ్రంగా ఉల్లంఘించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. ” రాష్ట్ర మంత్రి శ్రీమతి ఉషా శ్రీచరణ్‌ని డబ్బుల పంపిణీపై క్యాడర్ కు, అధికారులకు సూచనలు ఇస్తున్న వీడియో బయట పడింది. ఓటుకు రూ.1000 పంచాలని స్వయంగా మంత్రి చెప్పారు. ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కి ఎంపీ మిథున్ రెడ్డి కడప క్రాస్ నుండి తంబళ్లపల్లి వరకు ర్యాలీ నిర్వహించారు. 48 గంటల ముందే ప్రచారం నిలిపివేయాల్సి ఉన్నా…ఆ నిబంధనలు ఎంపి ఉల్లంఘించారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలోని వార్డు నెం. 16, బూత్ నంబర్: 232లో వైఎస్‌ఆర్‌సిపి అనుచరుడు ఈశ్వరరావు డబ్బు పంపిణీ చేస్తూ పట్టుబడ్డాడు. తిరుపతి పట్టణంలో 9వ తరగతి విద్యార్హత కలిగిన విజయ అనే మహిళ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అక్రమ ఓటు వేసింది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో YSRCP అనుచరులు రమణ మహర్షి స్కూల్ వద్ద డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కారు. తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, అతని కుమారుడు అభినయ్ రెడ్డి, డిప్యూటీ మేయర్ పోలింగ్ బూత్‌లలోకి అక్రమంగా ప్రవేశించారు. పోలింగ్ బూత్ నెం. 233, 233A లలోకి అక్రమగా ప్రవేశించడమే కాకుండా టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చారు” అని చంద్రబాబు పేర్కొన్నారు.

Also Read:MLC election polling: ప్రశాంతంగా కొనసాగుతున్న టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..

బోగస్ ఓట్లపై ప్రశ్నించిన టీడీపీ నేత దేవనారాయణరెడ్డిని అక్రమంగా పోలీసు కస్టడీలోకి తీసుకున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఒంగోలు పట్టణంలో టీడీపీ టెంట్ వేయడానికి అంగీకరించని పోలీసులు వైసీపీ నాయకులకు మాత్రం అనుమతి ఇచ్చారని తెలిపారు. విశాఖలోని 53వ వార్డు YSRCP కార్పొరేటర్ బర్కత్ అలీ ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తూ వీడియోలో పట్టుబడ్డారని చెప్పారు. బోగస్ ఓటర్లపై అభ్యంతరం వ్యక్తం చేసినందుకు తిరుపతి పట్టణంలో టీడీపీ నేతలు నర్సింహ యాదవ్, ఇతర నేతలను అరెస్టు చేశారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ బోగస్ ఓట్లకు సహకరించేందుకే పోలీసులు ఈ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. తిరుపతి పట్టణంలో వైసీపీ బోగస్ ఓట్లను ప్రశ్నించిన టీడీపీ నాయకుడు, పోలింగ్ ఏజెంట్ పులిగోరు మురళి ని అక్రమంగా అరెస్టుచేశారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనలకు సంబంధించి ఆధారాలు లేఖతో పాటు చంద్రబాబు పంపించారు.