వంట గదిలో కుంపటి పెడుతున్నాయి వంట నూనెల ధరలు.. అమాంతం పెరిగిపోయిన వంట నూనెల ధరలతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి… పెట్రో ధరలు, గ్యాస్ బాదుడుకు తోడు వంట నూనెల ధరల ప్రభావం అందరిపై పడుతోంది.. అయితే, పండుగల వేళ వినియోగదారులకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. ముడి పామాయిల్, సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెలపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.. ఇక, వంటనూనెలపై ఉన్న అగ్రిసెస్ను కూడా తగ్గించింది కేంద్రం.. దీంతో దేశీయంగా వంట నూనె ధరలు కొంత వరకు తగ్గనున్నాయి. ఇది పండగల సమయంలో.. సామాన్యులకు కాస్త ఊరట కల్పించే విషయమే.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ముడి పామాయిల్పై ఉన్న అగ్రిసెస్ 7.5 శాతానికి, ముడి సోయాబిన్ ఆయిల్, ముడి పొద్దుతిరుగుడు నూనెపై 5.5 శాతానికి తగ్గిపోయింది.. ఇక రిఫైన్డ్ వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 32.5 శాతం నుంచి 17.5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది ఎన్డీఏ సర్కార్.. కేంద్రం తగ్గించిన ఈ ధరలు ఈ నెల 14వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.. మొత్తంగా గత ఏడాది కాలంగా అమాంతం పెరిగిపోయిన వంట నూనె ధర కాస్త తగ్గనుంది. పండుగ సీజన్లో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే ప్రయత్నాలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది సర్కార్.. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని రెవెన్యూ శాఖ బుధవారం రెండు నోటిఫికేషన్లను జారీ చేసింది.