ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. చర్చిలకు ఎంపీ లాడ్స్ నిధుల ఖర్చుపై నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. సీఎస్, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శికి ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం లేఖలు పంపించింది. పీఎంవోకు ఇవ్వాల్సి ఉన్నందున తక్షణమే నివేదిక పంపాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సూచించింది.
Read Also: రెండు దశాబ్దాలుగా నరసరావుపేటలో టీడీపీ డల్..!
గతంలోనే ఎంపీ లాడ్స్ నిధుల దుర్వినియోగంపై ఏపీ సర్కారు వివరణ ఇవ్వాలని కోరగా ఇప్పటివరకు స్పందించకపోవడంపై కేంద్ర ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. కాగా చర్చిలకు నిధుల కేటాయింపుపై ఇటీవల ప్రధాని మోడీకి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. వైసీపీ ఎంపీ నందిగాం సురేష్ ఓ చర్చి నిర్మాణానికి రూ.40 లక్షలకు పైగా నిధులు కేటాయించినట్లు మీడియా కథనాలతో సహా రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖలో ఆరోపించారు. కాగా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంపీలకు కేటాయించే నిధులను మతపరమైన అంశాలకు వాడకూడదనే నిబంధన ఉంది.