NTV Telugu Site icon

కేసీఆర్‌పై బీజేపీ నేత మోత్కుపల్లి ప్రశంసలు.. మీపై విశ్వాసం పెరిగింది..!

Motkupalli KCR

Motkupalli KCR

సీఎం కేసీఆర్‌ నిర్వహించిన అఖిలపక్ష సమావేశాన్ని బీజేపీ బహిష్కరించినా.. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాత్రం హాజరుకావడం ఆస్తికరంగా మారింది.. అంతే కాదు.. సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించిన మోత్కుపల్లి.. ఆయనకు అభినందనలు తెలిపారు.. మరియమ్మ లాకప్ డెత్ విషయంలో మీరు తీసుకున్న రక్షణ చర్యలు దళిత వర్గాల్లో చర్చనీయాంశమైంది.. దళితుల్లో మీ మీద విశ్వాసం పెరిగిందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు మోత్కుపల్లి.. ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉండే అవకాశాన్ని ఈ సమావేశం నిర్వహించడం ద్వారా మీరు సద్వినియోగం చేసుకోవడం సంతోషంగా ఉందన్న ఆయన.. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి.. దళితుల అభివృద్ధికి ఏమి చేయాలని.. మమ్మల్ని అందరినీ పిలిచి సలహాలు తీసుకోవడం.. దళిత సమాజంలో మానసిక ఉత్తేజం కలిగించింది.. అందరకు మీకు ధన్యవాదులు అని తెలిపారు.

తెలంగాణ వచ్చిన తర్వాత వివిధ సందర్భాల్లో అన్యాయాలకు గురైన దళిత కుటుంబాలను గుర్తించి, ఆదుకొని వారికి రక్షణ చర్యలు ప్రకటించాలని ఈ సందర్భంగా కేసీఆర్‌ను కోరారు మోత్కుపల్లి.. దళిత సాధికారతలో భాగంగా దళారులు లేకుండా నేరుగా దళితులకు ఆర్థికసాయం అందిస్తెనే మేలు జరుగుతుందన్న ఆయన.. రైతుబంధు పథకం లాగా నేరుగా ఆర్థిక సహాయం అందిస్తే దళితులు సంతోషిస్తారిన తెలిపారు.. దళితుల కోసం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడాన్ని హృదయపూర్వకంగా అభినందించిన మోత్కుపల్లి నర్సింహులు… ఇక, యాదగిరిగుట్టను, ప్రపంచం గుర్తించే రీతిలో తీర్చిదిద్దుతున్నందుకు, అక్కడి నుంచి ఐదు సార్లు గెలిచిన ప్రజాప్రతినిధిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు వెల్లడించారు.. గురుకుల పాఠశాలలు వచ్చిన తర్వాత దళిత విద్యార్థులు.. కలెక్టర్‌ వంటి ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేయాలనే, వారి ఆకాంక్షలు నెరవేరుతుండటం ఆనందదాయకం అన్నారు.. ఎస్సీల అభివృద్ది గురించి ఇంతగా తపించే మీకు భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు మోత్కుపల్లి. కాగా.. ఈ సమావేశానికి మోత్కుపల్లి వెళ్లాల్సింది కాదని.. పార్టీ తీసుకున్న నిర్ణయం ఆయనకు తెలుసు.. కమ్యూనికేషన్‌ గ్యాప్‌ కూడా లేదని ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వివేక్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మొత్తంగా.. ఈ సమావేశానికి మోత్కుపల్లి హాజరు కావడం.. సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించడం ఆస్తికరంగా మారింది.