సింహాచలం, మాన్సాస్ భూముల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఏపీ సర్కార్ ఆదేశించింది. నోడల్ అధికారిగా దేవాదాయశాఖ కమిషనర్ నియమించింది. ఇప్పటికే ప్రాథమిక నివేదికను సమర్పించిన దేవాదాయశాఖ త్రిసభ్య కమిటీ సింహాచలం ఆలయ ప్రాపర్టీ రిజిస్ట్రార్లో 860 ఎకరాల భూములు గల్లంతైనట్టు అంచనా వేస్తోంది. మాన్సాస్ భూముల అమ్మకాల్లో రూ. 74 కోట్లు నష్టం వాటిల్లినట్లు కమిటీ తేల్చింది. ఇప్పటికే అడిషనల్ కమిషనర్ రామచంద్రమోహన్, డిప్యూటీ ఈవో సుజాత ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
మాన్సాస్, సింహాచలం భూముల వ్యవహరంపై విచారణ చేయించేందుకు విజిలెన్స్ ఎన్ఫోర్సుమెంట్ దర్యాప్తునకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం… సింహాచలం భూములను ఆస్తుల రిజిస్ట్రీ నుంచి అక్రమంగా తొలగించటం, మాన్సాస్ ట్రస్టు భూముల విక్రయాలకు సంబంధించి విజిలెన్స్ ఎన్ ఫోర్సుమెంట్ విభాగం దర్యాప్తు చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.. అప్పటి దేవస్థానం ఈవో, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఈ అవకతవకలకు కారణమని ప్రాథమికంగా తేలటంతో సస్పెన్షన్ వేటు వేసినట్టు పేర్కొంది. దేవాదాయశాఖలోని ముగ్గురు సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు రామచంద్రమోహన్ పై చర్యలు తీసుకున్నట్టు వెల్లడించిన ప్రభుత్వం.. తీవ్రత దృష్ట్యా మరింత మంది పాత్ర ఈ అవకతవకల్లో బయటపడే అవకాశమున్నందున లోతుగా దర్యాప్తు చేసేందుకు విజిలెన్స్ విచారణకు పూనుకుంది. మూడు నెలల్లోగా విచారణ నివేదికను సమర్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.. ఈ అవకతవకలకు సంబంధించి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి సమాచారం ఇచ్చేందుకు దేవాదాయశాఖ కమిషనర్ నోడల్ అధికారిగా ఉంటారని పేర్కొంది. ప్రత్యేకించి మాన్సాస్ ట్రస్టులో పెద్ద మొత్తంలో భూముల అవకతవకలు జరిగటంతో నేరుగా విజిలెన్సు ఎన్ ఫోర్సుమెంట్ విభాగం ముందస్తు సమాచారంతో తనిఖీలు చేయొచ్చని స్పష్టం చేసింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి వాణి మోహన్.