మనిషి హాయిగా బ్రతకాలంటే ఏదైనా ఉపాధి కావాలి. అందుకే సొంతంగా వ్యాపారం కొందరు చేస్తుంటే..! మరి కొందరు ఉద్యోగాలు చేస్తుంటారు. ప్రస్తుత సమాజంలో పురుషులకు పోటీగా మహిళలు ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. ప్రైవేట్ తో పాటు ప్రభుత్వ రంగంలోనూ మహిళలు మెరుగైన ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఐతే మహిళలు ఎక్కడ పనిచేస్తూన్నా వారికి వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయి. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్న యువతిని వేధించిన యువకుడికి నాంపల్లి కోర్టు ఐదు రోజుల జైలు శిక్ష విధించింది.
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన షీటీమ్ బృందాలు నిందితుడిని గుర్తించి పట్టుకున్నాయి. సుమారు 20 రోజుల పాటు బైక్ పై వెంబడించిన వ్యక్తి, బైక్ ఫొటోలను తీసిన యువతి ఆధారాలతో షీ టీమ్కు ఫిర్యాదు చేసింది. గత నెల 21న ఆమె ఆస్పత్రిలో పని పూర్తి చేసుకుని మధ్యాహ్నం 3 గంటల సమయంలో జూబ్లీహిల్స్లో వెళ్తుండగా, బైక్పై వచ్చిన వ్యక్తి అసభ్య పదజాలంతో కామెంట్లు చేశాడు.
రెండు రోజుల తర్వాత బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్ వద్ద కనిపించాడు. తిరిగి ఈ నెల 16న సాయంత్రం 7.30 గంటలకు బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో కనిపించాడు. అప్రమత్తమైన యువతి అతని ఫొటోతో పాటు, బైక్ ఫొటో తీసుకుని షీటీమ్ను ఆశ్రయించింది. నిందితుడు బంజారాహిల్స్కు చెందిన జిల్లా నగేశ్ (36)గా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థానం ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
మరో ముగ్గురు అదుపులో..
మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన ముగ్గురికి సికింద్రాబాద్ 12 ఎంఎం ప్రత్యేక కోర్టు జైలుశిక్ష విధించింది. గాంధీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని భోలక్ఫూర్ నివాసులు మణికంఠ (19), భువనేశ్వర్ (19), పొట్టి శ్రీరాములునగర్లోని సీసీనగర్ నివాసి కె.భరత్ అలియాస్ బాలు (29) తాగిన మైకంలో మహిళలు, యువతులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో వారిని అరెస్ట్ చేసి సికింద్రాబాద్ 12 ఎంఎం ప్రత్యేక కోర్టులో హాజరుపరచారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి.. మణికంఠకు 37 రోజులు, భువనేశ్వర్కు 19 రోజులు, కె.భరత్కు 112 రోజుల శిక్ష విధించారు.
Jammu Kashmir: కాశ్మీర్ లో రెండు ఎన్ కౌంటర్లు… నలుగురు లష్కర్ ఉగ్రవాదులు ఖతం