టీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ విచారణ జరుగుతున్న క్రమంలోనే ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఈ క్రమంలో ఈటల తన సొంత నియోజకవర్గం హుజురాబాద్లో కార్యకర్తలు, నేతలతో చర్చించారు.
ఇదిలావుంటే, తాజాగా ఈటల వరుసగా ఇతర పార్టీల ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. మంగళవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ఈటల భేటీ అయ్యారు. అంతకు ముందు ఎంపీ డీ.శ్రీనివాస్ తోను ఆయన కుటుంబ సభ్యులతోను కలిసి రహస్య చర్చలు చేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో కూడా సమావేశమయ్యారు. సానుభూతి సంపాదించే పనిలో భాగంగానే ఈటల అన్ని పార్టీల నేతలతో సమావేశం అయినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే ఇలా అన్ని పార్టీల నేతలతో ఆయన రహస్య చర్చలు జరపడంపై తెలంగాణలో పెద్ద చర్చ నడుస్తోంది. ఏ వ్యూహంతో రాజేందర్ వీరందరిని కలుస్తున్నారన్నది పెద్ద చర్చ. అయితే సమయం వచ్చినప్పుడు టీఆర్ఎస్ కి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, హుజురాబాద్ నుంచి ఇండిపెండెంట్ గా ఈటల బరిలోకి దిగబోతున్నారని బాగా ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగా రాజేందర్ అన్ని పార్టీల నేతలతో కలుస్తున్నారట. ఈటల టీఆర్ఎస్ ని వీడటం ఖాయం! ఇండిపెండెంట్ గా పోటీ చేయడం ఖరారే! అది ఇప్పుడా? ఎప్పుడా? అనేది తేలాల్సివుంది.