రంగారెడ్డి జిల్లాలో చేపలు వృధాగా పారవేయడం కలకలం రేపింది. మార్గశిర మాసం మొదలవడంతో.. చేపల కోసం మార్కెట్లకు ప్రజలు క్యూకట్టారు. దీంతో చేపలకు విపరీతంగా గిరాకీ పెరిగింది. ఎక్కువ రేటు వున్నాకూడా వినియోగదారుడు చేపలు కొనడానికి వెనుకంజ వేయలేదు. అయితే అది నిన్నటి మాట. రంగారెడ్డిజిల్లా జలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు పరిసర ప్రాంతంలో నిర్వాహకులు చేపలను వృధాగా పడేయడం కలకలం రేపుతోంది.
గంగపుత్ర సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏడాది నిర్వహించే చేప పిల్లల పెంపకం నేల పాలయ్యింది. మార్గశిర మాసం కావడంతో.. కిలో చేపల ధర 250-300 రూపాయలు పలికింది. కొన్ని చేపలు అమ్ముడు పోయాయి… మరికొన్ని చేపలు వృధాగా వుండిపోయాయి. దీంతో నిర్వాహకులు అమ్మకం తర్వాత పెద్ద ఎత్తున చేపలను పరిసర ప్రాంతంలోనే పారవేశారు. దీంతో.. ఇది చూసిన గ్రామస్తులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపాలిటీ వారు. ప్రభుత్వం వారు కానీ ధరలను నిర్దేశించలేదు.వీరు ఇస్టానుసారంగా ధరలను పెంచేసి సామాన్యుడికి అందనంత విధంగా చేపలను అధిక ధరకు అమ్మారు. మిగిలినవి అక్కడ పడేసి వెళ్లడం ఎంతవరకు సమంజసం అని ప్రజలు మండిపడుతున్నారు. ఇకపై స్థానికంగా ఉండే గ్రామస్తులకు వారు కొనే ధరలకే అమ్మాలని, లేదంటే గంగపుత్ర సంఘాలను సాగనంపి.. గ్రామస్తులకు చెరువు కేటాయించాలని కోరుతున్నారు. చేపలను ఇలా వృధాగా ఇష్టాను సారంగా పారబోసిన వారిపై మున్సిపాలిటీ కమీషనర్ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.