ఉద్యోగుల పరస్పర బదిలీలపై జీఓ 402ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని యుయస్పీసి స్టీరింగ్ కమిటీ డిమాండ్ చేసింది. ఉద్యోగుల లోకల్ క్యాడర్ కేటాయింపు నిబంధనలపై సంఘాలతో సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా జీఓ నెం 317ను విడుదల చేసిన కారణంగా నష్టపోయిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు న్యాయం చేయటానికి పరస్పర బదిలీలకు అనుమతించాలని యుయస్పీసి పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ స్టీరింగ్ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ మేరకు జీఓ 21ని ప్రభుత్వం విడుదల చేసింది. అందులో రాష్ట్రపతి ఉత్తర్వులు 2018కి అనుగుణంగా జీఓ 317లోని నిబంధనల ప్రకారం ఉద్యోగుల లోకల్ క్యాడర్ కేటాయింపులు పూర్తి అయిందని, ఉద్యోగుల కోరిక మేరకు ఇంటర్ లోకల్ క్యాడర్ పరస్పర బదిలీలకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
సీనియారిటీ కోల్పోతారని పేర్కొనడంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొన్నది. యుయస్పీసి అభ్యర్ధన మేరకు ప్రభుత్వం ఉమ్మడి జిల్లా సీనియారిటీకి రక్షణ కల్పిస్తూ జీఓ 402ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జీఓ రాష్ట్రపతి ఉత్తర్వులకు భిన్నంగా ఉందని పేర్కొంటూ హైకోర్టు జీఓ 402ను సస్పెండ్ చేసింది. జీఓ 402 రక్షణ కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలని కోరుతున్నామన్నారు. అదేవిధంగా జీఓ 21 ప్రకారం దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు, ఉద్యోగుల పరస్పర బదిలీ ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలని కూడా యుయస్పీసి పక్షాన డిమాండ్ చేస్తున్నామని వెల్లడించారు. ఎవరైనా ఉపాధ్యాయులు పరస్పర బదిలీ రద్దు చేసుకోదల్చుకుంటే దరఖాస్తును ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించాలని కోరుతున్నామని, అదేవిధంగా హోల్డ్ లో ఉంచిన 13 జిల్లాల స్పౌజ్ కేసులు, 19 జల్లాల్లో మిగిలిపోయిన/ మిస్ అయిన కేసులను వెంటనే పరిష్కరించాలన్నారు.
సీనియారిటీ, స్పెషల్ క్యాటగిరి, వితంతువుల అప్పీల్స్ పరిష్కారంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని, ఏడేళ్ళుగా పదోన్నతులు లేక అర్హత గలిగిన ఉపాధ్యాయులు, సబ్జెక్టు టీచర్స్ కొరతతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. స్కూల్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేసిన 10,479 పోస్టుల పదోన్నతుల విషయంలో నెలకొన్న న్యాయ వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని వారు కోరారు.
5571 పీఎస్ హెచ్చెం పోస్టులు మంజూరు చేయాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన విధంగా వెంటనే పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించి, వేసవిలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని యుయస్పీసి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి యుయస్పీసి పక్షాన వినతిపత్రం సమర్పించారు.