జీడీపీ పెంచమంటే.. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. సికింద్రాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీస్ వద్ద టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె… ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రంపై ఫైర్ అయ్యారు.. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలే మనల్ని రోడ్లపైకి తీసుకువచ్చిందన్న కవిత.. తెలంగాణ ప్రజలను రోడ్లపైకి తీసుకువచ్చిన ఘనత మోడీ సర్కార్ కు దక్కుతుందని ఎద్దేవా చేశారు.. తెలంగాణలో రైతులు ఆందోళనలో ఉన్నారు.. బీజేపీ నేతలు అనేక మాటలు చెబుతున్నారు.. కానీ, ధాన్యం సేకరణ పై మాత్రం మాట్లాడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: AP Legislative Council: టీడీపీ సభ్యులపై చైర్మన్ ఆగ్రహం.. 8 మంది సస్పెన్షన్
తెలంగాణ ఉద్యమం తర్వాత మనం రోడ్లపైకి రావడం మళ్లీ ఇదే మొదటిసారి అన్నారు ఎమ్మెల్సీ కవిత.. బీజేపీ ప్రభుత్వానికి సిగ్గు ఉండాలి అంటూ ఫైర్ అయిన ఆమె.. గ్యాస్ సిలిండర్ 400 రూపాయాలకే ఇవ్వాలని.. పెరిగిన భారాన్ని కేంద్రం భరించాలని డిమాండ్ చేశారు. పెద్ద, పెద్ద మాటలు మాట్లాడుతున్నారంటూ బండి సంజయ్పై మండిపడ్డ ఆమె.. వాళ్లను, వీళ్లను జైలులో పెట్టిస్తా అంటాడు.. దమ్ము ఉంటే కేంద్రం నుంచి సిలిండర్ పై తెలంగాణకు సబ్సిడీపై ప్రత్యేక ప్యాకేజి ఇప్పించాలని సూచించారు.. పేద ప్రజలకు మోడీ సర్కార్ ఏమి చేయలేదని విమర్శించిన కవిత.. పెద్ద పెద్ద వాళ్లకు రుణమాఫీ చేసింది మోడీ సర్కార్ అని.. అంబానీ, ఆదానీలకు, దేశం విడిచివెళ్లిన విజయ్ మాల్యాకు మాత్రమే రుణమాఫీ జరిగిందంటూ ఎద్దేవా చేశారు.. ప్రజా ఉద్యమ నిర్మాణం పటిష్టంగా చేస్తే ఈ కేంద్ర సర్కార్ దిగివస్తుందని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటం చేద్దామని సూచించారు ఎమ్మెల్సీ కవిత.