తెలుగువాళ్లు అంటే మోడీకి చిన్న చూపు అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగువాడు ఉన్నత స్థాయికి ఎదిగిన వెంకయ్య నాయుడిని అవమానించారు మోడీ అంటూ ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి. ఏపీకి మంత్రి లేడని తెలంగాణకి ఉన్నా లాభం లేదంటూ ఆయన విమర్శలు గుప్పించారు. ఉన్న ఒక్క దత్తాత్రేయ నీ తీసేశారని, బీజేపీ కాకినాడలో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని తీర్మానం చేసిందని, అప్పుడు ప్రజలను వంచించింది బీజేపీ అని ఆయన ఆరోపించారు. 7గురు ఎంపీలు గెలిచి ప్రజలను మోసం చేసిన పార్టీ బీజేపీ అని.. మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసి.. తెలంగాణ మాటే ఎత్తలేదన్నారు. ఆంధ్రలో పార్టీ నీ చంపుకుని తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అని.. తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇచ్చారు సోనియా గాంధీ అని ఆయన వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల్లో మోడీ తెలంగాణ మనుగడనే విమర్శించారన్న రేవంత్ రెడ్డి.. తల్లిని చంపి పిల్లను ఇచ్చారు అని మోడీ అన్నారని గుర్తు చేశారు.
పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ ఇచ్చిన రోజు చీకటి రోజు అని మోడీ మాట్లాడారని, తెలంగాణకి బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ.. గిరిజన యూనివర్సిటీ.. ఐటీఐఆర్నీ ఇచ్చింది కాంగ్రెస్ అని ఆయన తెలిపారు. పార్లమెంట్లో ఆమోదించిన అంశాలు మోడీ ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఖాజీ పేట రైల్వే కోచ్ గురించి అడిగినా మోడీ స్పందించలేదని, తెలంగాణకి తీవ్ర అన్యాయం చేసింది అని పార్లమెంట్లో గుర్తు చేస్తే అసలు పట్టించుకోలేదన్నారు. తెలంగాణకి న్యాయం చేయకపోగా.. తెలంగాణ ఏర్పాటును తప్పు పట్టి తెలంగాణ ఆత్మగౌరవంనీ దెబ్బ తీశారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆదాయం రెండింతలు చేస్తా అన్నారు ఏమైందని, స్విస్ బ్యాంక్ డబ్బులు వెనక్కి తెస్తా అన్నారు ఏమైందని ఆయన సెటైర్లు వేశారు.