సిద్ధిపేట జిల్లా కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ప్రమాద వశాత్తు మృతిచెందిన ఆంజనేయులు కుటుంబాన్ని హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ పరామర్శించి, యాభై వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్పై ధ్వజమెత్తారు.మత్స్యకార కుటుంబంలో పుట్టిన ఆంజనేయులు ఐదు నిమిషాలపాటు నీటిలో మునిగి ఉండగలిగిన వ్యక్తి అని ఈటల అన్నారు. ఆంజనేయులు ఎలా చనిపోయాడో నిగ్గు తేల్చి, ఆర్థికంగా ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నేడు పోలీస్ల పహారతో ఆంజనేయులు కుటుంబానని బెదిరించవచ్చని, దీని పై తెలంగాణ సమాజం ఎలా స్పందిచాలో అలానే స్పందించి తగిన గుణపాఠం చెబుతుందన్నారు.
ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి ఉంటే లాభం జరుగుతుందని, స్వేచ్ఛ, రక్షణ ఉంటుందని భావించిన ప్రజలకు ఈ చర్యతో వారి కళ్లు తెరిపించిందన్నారు. ఈ ఫామ్ హౌస్ వచ్చిన తర్వాత స్వేచ్చ, లాభం దేవుడెరుగు కానీ వీళ్ళను పెడుతున్న హింస అంత ఇంత కాదని ఈటల ఆగ్రహించారు. గతంలో పోలీసుల నిర్భాందాన్ని చవి చూడని ఈ ప్రాంతం ఇప్పుడు నిత్యం పోలీసులు దౌర్జన్యాన్ని చూడాల్సి వస్తోందన్నారు. కేవలం చావు ఖర్చుల కోసం ప్రభుత్వం యాభై వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవడం సిగ్గు చేటని ఈటల మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆంజేనేయులు కుటుంబానికి ఆర్థికంగా సాయం చేయాలన్నారు.