ఓ వైపు కోవిడ్ మహమ్మారితో యుద్ధం చేస్తుంటే మరో వైపు ఇతర వ్యాధుల పెరుగుదల, మరణాలు ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. తాజాగా తెలంగాణపై క్యాన్సర్ పంజా విసురుతోంది. ప్రతీ ఏటా బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఎంతగా పెరుగుతోందంటే గత 30 ఏళ్లలో 50 శాతం క్యాన్సర్ కేసులు పెరిగాయని నిపుణులు హెచ్చరించారు. పట్టణ జనాభాలో రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తులు, గర్భాశయం,అన్నవాహిక క్యాన్సర్లు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరించారు. 1990లో ఉమ్మడి ఏపీలో ఒక లక్షమంది జనాభాకు 54 క్యాన్సర్ రోగులు ఉన్నారని కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి లక్ష జనాభాకు 75మంది క్యాన్సర్ రోగులున్నారని తెలిపారు.
గత మూడేళ్లలో తెలంగాణలో ఏకంగా 76,234 మంది క్యాన్సర్తో మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం క్యాన్సర్ మరణాల్లో తెలంగాణరాష్ర్టం దేశంలోనే 13వ స్థానంలో నిలిచింది. నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ రిపోర్టు-2020, ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) కేన్సర్ రిజిస్ర్టీ ప్రకారం 2018- నుంచి2020 మంధ్య క్యాన్సర్ మరణాలు భారీగా పెరిగాయి. 2020లో దేశంలో 13.92లక్షల మంది క్యాన్సర్ మహమ్మారితో కన్నుమూయగా అత్యధికంగా యూపీలో 1.11 లక్షల మంది మృత్యువాత పడ్డారు. కాగా, పొగాకు ఉత్పత్తులే క్యాన్సర్ మరణాలకు ప్రధాన కారణం అవుతుంది.