Telangana Rains : తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అత్యవసర పనుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు కోటి రూపాయల చొప్పున మొత్తం రూ. 33 కోట్లను తక్షణమే విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, ప్రజల భద్రత, సహాయక చర్యలకు నిధుల కొరత లేకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. ఈ నిధులు వర్షాల వల్ల తలెత్తే అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి, సహాయక చర్యలు చేపట్టడానికి, నష్టం జరిగిన ప్రాంతాలలో తక్షణ మరమ్మతు పనులు చేయడానికి ఉపయోగపడతాయి. జిల్లా యంత్రాంగాలు ఈ నిధులను అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.