తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో.. కసరత్తు ప్రారంభించిన కాంగ్రెస్ అధిష్టానం.. ఓ నిర్ణయానికి వచ్చి.. పీసీసీ, ఇతర కమిటీలపై ప్రకటన చేసే సమయానికి.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు వచ్చాయి.. ఉప ఎన్నికలు ముగిసేవరకు పీసీసీ ప్రకటన వాయిదా వేయాలంటూ సీనియర్ నేత జానారెడ్డి విజ్ఞప్తిపై ప్రకటన వాయిదా వేసింది అధిష్టానం.. ఎన్నికలు ముగిసిపోయినా.. దీనిపై ప్రకటన రాకపోగా.. పదవులకోసం మళ్లీ లాబియింగులు మొదలయ్యాయి.. తెలంగాణ కాంగ్రెస్లో పీసీసీ నియామక ప్రక్రియపై మళ్లీ పంచాయతీ మొదలైంది. పదవి నాకు కావాలి.. అంటే నాకు అంటూ పోటీ పడుతున్నారు నేతలు. పదవి కోసం పోటీ పడటం సహజమే. అయితే, నాకు పదవి వచ్చినా రాకపోయినా… పక్కోడికి మాత్రం రావొద్దు అనే తరహా ఫిర్యాదులు చేసే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. ఎవరికి వారు… తమ పంతాన్ని నెగ్గించుకునే పనిలో పడ్డారు. దీనిలో భాగంగా ఢిల్లీ బాటపట్టారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. రెండు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. ఇక, రాత్రి హస్తినకు వెళ్లారు మరో ఎంపీ రేవంత్రెడ్డి.. ఇవాళ ఉదయం ఢిల్లీ వెళ్లారు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క.. మరోవైపు.. సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ కూడా ఢిల్లీలోనే ఉన్నారు.. దీంతో.. ఏం జరుగుతోందనే ఉత్కంఠ నెలకొంది.
ఇక, తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి కావాల్సిందేనని పట్టు పడుతున్న వారిలో… కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రేవంత్ రెడ్డి ముందున్నారు. ఇక నాక్కూడా పిసిసి కావాలని అడిగే వారిలో వీహెచ్.. జగ్గారెడ్డి కూడా ఉన్నారు. అయితే… మనసులో పీసీసీ కావాలని ఉన్నా… బయటకు మాత్రం చెప్పరు. తన టీంతో మాత్రం పిసిసి కోసం ప్రయత్నాలు చేస్తారు మరో నాయకుడు. ఇలా పార్టీలో నాయకులు కూడా చీలిపోయారు. ఉత్తమ్ రాజీనామా చేసినప్పటి నుండి… అభిప్రాయ సేకరణలో మెజారిటీ నాయకులు రేవంత్ పేరే ప్రతిపాదించారు… కాబట్టి ఆయనకే పిసిసి ఇవ్వాలి అనే వారు రేవంత్ టీం. దీంట్లో మాజీ మంత్రులు.. మాజీ ఎంపీలు ఉన్నారు. ఈ టీం అంతా.. ఇప్పటికే చేయాల్సిన ప్రయత్నాలు చేసింది… చేస్తూనే ఉంది. ఇప్పుడు నేతలంతా అధిష్టానం దగ్గర వాలిపోవడంతో.. ఏం జరుగుతోంది.. గతంలో ఫైనల్ చేసిన జాబితా మళ్లీ మారిపోనుందా..? రాష్ట్ర నేతల ఒత్తిడికి కాంగ్రెస్ అధిష్టానం దిగివస్తుందా? అనే చర్చ సాగుతోంది.