రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్రావు.. వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన.. వరంగల్ అర్బన్ కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీలతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.. ఆయా జిల్లాల్లో పరిస్థితి ఏంటి అనేదానిపై ఆరా తీశారు.. ఇక, తన పర్యటనలో ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించిన సీఎం.. కోవిడ్ రోగులతో మాట్లాడి.. వారి ఆరోగ్య పరిస్థితులు, అందుతున్న చికిత్సల గురించి అడిగి తెలుసుకున్నారు.. వారిలో భరోసా నింపుతూ ధైర్యాన్ని చెప్పారు.. ఆ తర్వాత వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించిన కేసీఆర్.. అక్కడి ఖైదీలతో మాట్లాడి యోగక్షేమాలను కనుక్కున్నారు. ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు.. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన సీఎం.. చికిత్సకు అవసరమైన అన్ని సమకూర్చుకోవాలని.. ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు.. మరణాల సంఖ్యను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇదే సమయంలో.. కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు.