టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కాసేపట్లో మీడియా ముందుకు రానున్నారు.. రాత్రి 8 గంటలకు కేసీఆర్ ప్రెస్మీట్ ఉందంటూ.. మీడియాకు సమాచారం ఇచ్చారు.. అయితే, కేసీఆర్ ఏ అంశాలపై మాట్లాడనున్నారు? అనేది మాత్రం ఉత్కంఠగా మారింది… తెలంగాణ రాజకీయాల్లో కాకరేపిన మునుగోడు ఉప ఎన్నికలో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది.. దీంతో, మునుగోడుపై గులాబీ బాస్ స్పందిస్తారనే ప్రచారం సాగుతోంది.. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం, పోలింగ్ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఇక, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి విక్టరీ కొడతారన్న పక్కా సర్వే రిపోర్ట్ కూడా ఉందట.. దీంతో.. మునుగోడు ఉప ఎన్నికపై కేసీఆర్ స్పందించే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోవైపు.. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. ఈ వ్యవహారంలో మరిన్ని ఆధారాలను కేసీఆర్ బయటపెడతారా? వీడియోలు చూపిస్తారా? అనే చర్చ సాగుతోంది.. అయితే, ఇప్పటికే మునుగోడు వేదికగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై స్పందించిన కేసీఆర్.. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున.. పూర్తిస్థాయిలో స్పందించలేనన్న విషయం విదితమే.. అవసరం అయినప్పుడు అన్నీ బయటపెడతాం.. దొంగలు అడ్డంగా దొరికిపోయారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.. మరోవైపు.. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ తీర్మానం చేశారు కేసీఆర్.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా రావడంతో.. బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ను కూడా వివరిస్తారనే చర్చ సాగుతోంది.. మొత్తంగా మాత్రం మునుగోడులో విక్టరీ కొడతామన్న నమ్మకంతో ఉంది టీఆర్ఎస్.. ఈ ప్రెస్మీట్ కూడా మునుగోడు చుట్టే తిరిగే అవకాశం ఉందని.. మునుగోడు ఓటర్లకు కేసీఆర్ ధన్యవాదాలు తెలుపుతారని తెలుస్తోంది. ఏమైనా.. కేసీఆర్ ప్రెస్మీట్పై ఉత్కంఠ నెలకొంది..