తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఖరారు అయింది. కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. 2021-22 బడ్జెట్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది. మార్చి 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 15న ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. 16న దివంగత ప్రజాప్రతినిధుల మృతి పట్ల సంతాప తీర్మానం ప్రకటిస్తారు. 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారు. 18న 11:30 నిమిషాలకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ పేద ప్రజలకు ఆశాజనకంగా ఉంటుందని అధికార పార్టీ వర్గాలు అంటున్నాయి. కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు వేడేక్కుతున్నాయి. ఎలాగైనా గెలవాలని అన్ని పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీ పార్టీ అయితే.. ఏకంగా కేంద్రమంత్రులనే రంగంలోకి దించుతోంది. ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి.