తెలంగాణలో ఇంటర్ ఫలితాలతో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. ఇంటర్ ఫస్టియర్లో 49 శాతం పాస్ కావడంతో విద్యార్థులు ఇంటర్ బోర్డు ముందు ఆందోళనలు చేస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే విద్యార్థి సంఘాలు జూనియర్ కాలేజీల బంద్ను సైతం నిర్వహించాయి. దీంతో ప్రతిరోజు ఇంటర్ బోర్డు ముందు ఆందోళనలకు దిగుతున్నారు. అటు జిల్లాల్లో సైతం ఇదేపరిస్థితి నెలకొంది. తరగతులు నిర్వహించకుండా పరీక్షలు పెట్టి తమను ఫెయిల్ చేయడం ఏంటని ప్రభుత్వాన్ని ఇంటర్ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ మార్కులతో పాస్ చేయాలని ఆలోచిస్తుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సైతం ఇంటర్ బోర్డు సిద్ధం చేసింది.
దీనిపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. త్వరలోనే తెలంగాణ సర్కార్ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. అయితే ఇంటర్ బోర్డు నిర్ణయానికి ప్రభుత్వం ఒప్పుకుంటుందా లేదా అన్నది వేచి చూడాలి. ఆందోళనలు విరమించాలంటే వారిని పాస్ చేయడం ఒక్కటే మార్గంగా ఇంటర్ బోర్డు భావిస్తుంది. మరోవైపు ఇప్పుడు పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వం పై ఆర్థిక భారం పడనుండటంతో ఇంటర్ బోర్డు నిర్ణయాన్నేఆమోదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు.