ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న సమయంలో పార్టీలు పొత్తు పెట్టుకోవడం సహజం. ఇది రాజకీయ తంత్రం.. ఎప్పుడు, ఎలాంటి మలుపులు వెలుగుచూస్తాయో ఎవ్వరూ ఊహించలేరు. ఈరోజు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్న వాళ్ళే రేపు చేతులు కలపొచ్చు. ఇలాంటి సందర్భాల్ని గతంలో ఎన్నో చూశాం. ఈ క్రమంలోనే తెలంగాణలో పొత్తు చర్చలు మొదలయ్యాయి. అయితే, కాంగ్రెస్ మాత్రం ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు.
రైతు సంఘర్షణ సభలో ఈ విషయాన్ని ఆయన ధృవీకరించారు. కాంగ్రెస్ పార్టీ ఎవరితోనూ చేతులు కలపదని, తెలంగాణను దోచుకున్న వారితో పొత్తులు పెట్టుకోమని తెలిపారు. అంతదాకా ఎందుకు.. పొత్తు గురించి కాంగ్రెస్ నేతల్లో ఎవరు మాట్లాడినా, పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. టీఆర్ఎస్తో గానీ, బీజేపీతో గానీ పొత్తు కోరుకునే కాంగ్రెస్ నేతలు.. ఆ పార్టీల్లోకి వెళ్ళిపోవచ్చని అన్నారు. అలాంటి నేతలు కాంగ్రెస్కి అవసరం లేదని తేల్చి చెప్పారు.
అంతేకాదు.. కాంగ్రెస్ విధానాల్ని విమర్శించినా సహించేది లేదని, ఎంత పెద్ద వారైనా పార్టీ నుంచి బయటకు నెట్టేస్తామని రాహుల్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో టికెట్ ప్రస్తావన వచ్చినప్పుడు, తెలంగాణ ప్రజల తరఫున పోరాటం చేసిన వారికే మెరిట్ ఆధారంగా టికెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎంత పెద్దవారైనా సరే.. రైతుల తరఫున, పేద ప్రజల తరఫున, యువత ఉద్యోగం గురించి పోరాటం చేయరో వారికి టికెట్ దొరకతని తేల్చేశారు.