టీఆర్ఎస్ కు భజన చేసే వారికి పబ్ ల అనుమతి ఇస్తున్నారని మండిపడ్డారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. రాష్ట్ర రాజధానిలో జరిగిన బాలిక అత్యాచారం ఘటనలో పోలీసుల దర్యాప్తు నిష్పక్షపాతంగా లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సి.బి.ఐ విచారణకు అనుమతించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధానిలో మైనర్ బాలికపై అత్యాచారం జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పబ్ లలోకి మైనర్లకు అనుమతి లేదు..మరి ఎలా అనుమతి చేశారు? అని ప్రశ్నించారు. మైనర్లకు మద్యం సరఫరా చేయకూడదు అన్న నిబంధన ఉన్నప్పటికీ ఎందుకు ఉల్లంఘించారని ఆయన నిలదీశారు.
పబ్ లకు లైసెన్స్ ఇచ్చేటప్పుడు నియంత్రించే ప్రయత్నం చేయకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ,హోంమంత్రిని హెచ్చరిస్తున్నానని, డ్రగ్స్ కు అడ్డాగా హైదరాబాద్ మారుతుంటే మీరేం చేస్తున్నారని భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా అంటూ ప్రశ్నించారు. హోం మంత్రి తన విధిని సక్రమంగా నిర్వర్తించడు. నిర్వర్తించమని అడిగితే కలవకుండా అరెస్ట్ చేస్తారా? అని మండిపడ్డారు. అత్యాచారం ఘటనపై దోషులను శిక్షించాలని హోంమంత్రి ,డీజీపీ ని కలవడానికి వెళ్లిన మా మహిళ కాంగ్రెస్ నేతలను అక్రమ అరెస్టులు చేస్తున్నారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
తెలంగాణ తెచ్చుకున్నది మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మడానికేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యాన్ని ఆదాయ వనరుగా ప్రభుత్వం చూడటం వల్లనే రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. డ్రగ్స్, మద్యం మత్తులో అమ్మాయిలపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్న నియంత్రిం చడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతున్నదని భట్టి విక్రమార్క ఎద్దేవ చేశారు. మైనర్ బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే నిందితులను అరెస్టు చేయడానికి ఎందుకు తాత్సర్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎందుకు హోంమంత్రి, పోలీస్ డిపార్ట్మెంట్ భయపడుతోందని, నిందితులు రాజకీయ పలుకుబడి ఎంత ఉన్న వారైనా కఠినమైన చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.