Ponguleti Srinivas Reddy: రాజకీయంగా వచ్చే పదవులు ఎవరికి శాశ్వతంగా ఉండవని.. ప్రజల్లో ప్రేమ అభిమానాలు ఉంటే పదవులు వాటి అంతటికి అవే వస్తాయన్నారు ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. శనివారం చండ్రుగొండ మండల కేంద్రంలో తన క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ… 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను ఇప్పటివరకు ఎందుకు నెరవేర్చలేదని సూటిగా ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి, సొంత జాగా ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి నిధులు, పోడు వ్యవసాయం చేసుకుంటున్న పోడు సాగుదారులందరికీ గిరిజన, గిరిజనేతరులందరికీ, పట్టాలిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు పట్టాలు ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
2019 ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోయినా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలన్నీ ప్రజలకు మేలు జరుగుతాయనే ఉద్దేశంతో ఇన్ని రోజులు పార్టీలోనే కొనసాగటం జరిగిందన్నారు పొంగులేటి.. అదే శీనన్నకు పదవులే కావాలి, హోదానే కావాలనుకుంటే 2019 ఎన్నికల్లోనే నేను నన్ను నమ్ముకున్న వాళ్లు, ప్రజా ప్రతినిధులు అయ్యేవాళ్లమన్నారు. ఈరోజు పదవుల్లో కొనసాగుతున్న వారి పదవులు శాశ్వతం కాదన్నారు. ప్రజల ప్రేమ ఆప్యాయతే మాకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ క్యాంపు కార్యాలయాలు ప్రజలకు ఏ సమస్యలు ఉన్న నేరుగా వచ్చి ఈ కార్యాలయంలో తెలియజేసిన వారి సమస్యలు పరిష్కరించేందుకే ఈ క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇక, తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయని.. ప్రత్యేక రాష్ట్రం వస్తే మన బతుకులు మారుతాయని పోరాటాలు చేసి ఆత్మ బలిదానాల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అన్నారు పొంగులేటి.. తెలంగాణ ఇచ్చామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీని కాదని తెలంగాణ రావడంలో కీలకపాత్ర పోషించిన బీజేపీని కాదని.. మనం కేసీఆర్ ని ముఖ్యమంత్రిని చేశాం.. రెండుసార్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ని ఎన్నుకున్నాం.. 9 సంవత్సరాల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.. కానీ, తెలంగాణలో రైతాంగం ఏదైతే కలగన్నారో అది సాధ్యం కాలేదన్నారు.. రాష్ట్రంలో గొప్పలు చెప్పుకోవడం తప్ప సాధించింది ఏమీ లేదు.. ఒరిగింది ఏమీ లేదని తెలంగాణ బిడ్డలు అనుకుంటున్నారని తెలిపారు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి.