తాము అండగా ఉంటామంటూ మృతిచెందిన రైతు కుటుంబానికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామానికి చెందిన చిన్న బీరయ్య.. 10 రోజులుగా వడ్లు అమ్ముకోవడానికి వచ్చి గుండె ఆగి మరణించిన విషయం తెలిసిందే.. ఇక, వడ్ల కుప్ప మీద తనువు చలించిన రైతు బీరయ్య కొడుకు రాజేందర్ తో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ నాయకులు సుభాష్ రెడ్డి గ్రామానికి వెళ్లి బీరయ్య కుటుంబ సభ్యులతో రేవంత్ రెడ్డి చేత ఫోన్ లో మాట్లాడించారు. ఈ సందర్భంగా బీరయ్య కొడుకు రాజేందర్ తో రేవంత్ రెడ్డి మాట్లాడి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో రైతులు అధైర్య పడవద్దు అని కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని రైతుల సమస్యల పరిష్కారం కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో ఉద్యమిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు..