కరోనా కారణంగా వాయిదా పడ్డ నుమాయిష్ను ఈ నెల 20 నుంచి తిరిగి ప్రారంభించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నుమాయిష్ కొనసాగనుంది. ఇందుకోసం అన్ని శాఖల నుంచి అనుమతులు మంజూరైనట్లు తెలుస్తోంది. ఈమేరకు స్టాళ్ల నిర్వాహకులకు ఆహ్వానాలు పంపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒకవేళ స్టాళ్ల నిర్వాహకులు సిద్ధంగా లేకపోతే ఫిబ్రవరి 25 నుంచి నుమాయిష్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అన్ని శాఖల నుంచి అనుమతులపై రెండురోజుల్లో అధికారిక ప్రకటన వస్తుందన్నారు.
కాగా జనవరి 1న గవర్నర్ తమిళిసై ప్రారంభించిన నుమాయిష్ మరుసటి రోజే కరోనా నిబంధనల కారణంగా మూతపడింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నుమాయిష్ను అర్ధాంతరంగా అధికారులు నిలిపివేశారు. తాజాగా కోవిడ్ నిబంధనలు సడలించడంతో ఎగ్జిబిషన్ నిర్వహణపై ఎగ్జిబిషన్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులు కీలక సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నట్లు సమాచారం.