పలు జిల్లాలో ఈనెల 21వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా.. బుధవారం నాడు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది.
తూర్పు, మధ్య బంగాళఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు రెండు రోజుల్లో ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొన్నది. ఉత్తర – దక్షిణ ద్రోణి పశ్చిమ విదర్భ నుంచి కర్నాటక మీదుగా ఉత్తర కేరళ వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కేంద్రీకృతమై ఉందన్నారు. దీంతో రాగల 24 గంటల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
వాతావరణంలో వస్తున్న మార్పులతో పాటు నైరుతి రుతుపవనాల ఆగమనం మొదలు కావడంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గి ఉపశమనం కలిగించింది. 20 జిల్లాల్లో 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు, 5 జిల్లాల్లో 39 పైన, మరో 5 జిల్లాల్లో 38పైన, 3 జిల్లాల్లో 37 డిగ్రీలపైన పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అత్యంత ఎక్కువగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 42.8, కొత్తగట్టులో 42.7, ఆదిలాబాద్ జిల్లా భోరజ్లో 42.6, ఆదిలాబాద్ 42.6 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువగా మెదక్ జిల్లా కల్లకల్లో 23.8 డిగ్రీలు నమోదైంది. గడిచిన 24 గంటల్లో అధికంగా ములుగు జిల్లా ఏటూరునాగరంలో 2.56 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
MI vs SRH: ఉత్కంఠపోరులో గెలిచిన హైదరాబాద్.. కానీ!