భూదాన్ ఉద్యమానికి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా మాజీ ఎంపీ ఏఐసీసీ, పంచాయితీ రాజ్ సంఘం చైర్ పర్సన్ మీనాక్షి నటరాజన్ సర్వోదయ సంకల్ప పాదయాత్ర ప్రారంభించారు. భూదాన్ పోచంపల్లి నుండి మహారాష్ట్రలో వర్ధా వరకు 600 కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగనుంది. ఈ నేపథ్యంలో నేడు ఈ పాదయాత్ర మెదక్ జిల్లాలోని మాసాయిపేట నుండి చేగుంట వరకు సాగింది. ఈ సర్వోదయ సంకల్ప పాదయాత్రలో మీనాక్షి నటరాజన్తో కలిసి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఉదయం మాసాయిపేట లో జరిగిన ప్రార్ధనలో పాల్గొని, అనంతరం మాసాయిపేట నుండి చేగుంట వరకు పాదయాత్ర చేశారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. భూదానోద్యమం జరిగి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మీనాక్షి నటరాజన్ చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోందని, గాంధీజీ, నెహ్రూ ల కాలంలో జరిగిన ఉద్యమాలు నేటి యువత తెలుసుకోవడం లేదని ఆయన అన్నారు. ఆ రోజు గాంధీజీ పిలుపు మేరకు వేల ఎకరాలు భూములను స్వచ్ఛందంగా దానం చేసి, భూములు లేని నిరుపేదలకు పంచారు. ఆ భూదానోద్యమానికి మన రాష్ట్రం నుండే ప్రారంభం కావడం మనకు గర్వ కారణమని ఆయన వ్యాఖ్యానించారు. వేలాదిమంది మంది నిరుపేదలకు ఉపయోగపడ్డ భూదానోద్యమాన్ని గుర్తు చేస్తూ రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ చైర్ పర్సన్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేపట్టడం అభినందనీయమన్నారు.