Minister KTR:చీమలపాడు అగ్నిప్రమాద బాధితులను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. నిన్న గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన నలుగురు బాధితులు హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ఈనేపథ్యంలో ఇవాల (గురువారం) ఉదయం మంత్రి కేటీఆర్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి నిమ్స్కు చేరుకుని బాధితులను పరామర్శించారు. నలుగురి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అయితే ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు మంత్రి కేటీఆర్కు తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ చీమలపాడు ఘటన దురదృష్టకరమన్నారు. ప్రమాదంలో కుట్ర ఏమైనా ఉందా అనేది విచారణలో తేలుతుందని అన్నారు. మృతుల కుటుంబాలకు ఇప్పటికే రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించామని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులను కోరారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తాము అండగా ఉంటామన్నారు.
నిన్న (బుధవారం) ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో ఓ గుడిసెలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం సభా ప్రాంగణానికి కూతవేటు దూరంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే చీమలపాడులో జిల్లా మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వర్ రావులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. కాగా.. మృతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశాలు జారీచేసింది. ఇక.. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. దీంతో పాటు నామా ముత్తయ్య ట్రస్టు ద్వారా మృతుల కుటుంబాలకు మరో రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు అందజేస్తామని ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున అందజేస్తామని ఎమ్మెల్యే రాములునాయక్ తెలిపారు.
Tragedy in Banjara Hills: విషాదం.. విద్యుదాఘాతంతో ముగ్గురు యువకులు మృతి