కరోనా మళ్లీ భారత్ను వణికిస్తోంది.. థర్డ్ వేవ్ దెబ్బకు రికార్డు స్థాయిలో రోజువారి కేసులు పెరుగుతూ పోతున్నాయి.. దీంతో అప్రమత్తమైన ఆయా రాష్ట్రాలు.. కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.. నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్డౌన్లు విధిస్తున్నాయి.. మరోవైపు, వ్యాక్సినేషన్పై ఫోకస్ పెడుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణలోనూ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పైకి కదులుతోంది.. ఇప్పటి వరకు తెలంగాణలో సాధారణ కోవిడ్ నిబంధనలు తప్పితే.. అదనంగా ఎలాంటి ఆంక్షలు లేవు.. అయితే, దీనిపై మంత్రి కేటీఆర్ను ప్రశ్నించారు నెటిజన్లు.. ట్విట్టర్లో మరోసారి ‘ఆస్క్ కేటీఆర్’ కార్యక్రమం నిర్వహించారు. రాజకీయ, అభివృద్ధి, తదితర అంశాలపై నెటిజన్ల ట్వీట్లపై కేటీఆర్ స్పందించారు. తమ సుస్థిర, సుపరిపాలనే భాజపా విద్వేష ప్రచారానికి తమ సమాధానమని కేటీఆర్ అన్నారు. భాజపా విషపూరిత అజెండాను రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారని.. తెలంగాణ కోసం ఎవరు పనిచేస్తున్నారో తెలుసన్నారు. పలు అంశాలపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు..
Read Also: బుసలు కొడుతోన్న కరోనా.. ఒకేరోజు 2.64 లక్షల కేసులు
ఇక, అనేక అంశాలపై ప్రశ్నలు సంధించారు నెటిజన్లు.. యూపీలో బీజేపీకి వ్యతిరేకంగా, సమాజ్ వాదీకి మద్దతుగా ప్రచారంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఓ ప్రశ్నికు బదులిచ్చారు.. మరోవైపు, లాక్డౌన్, నైట్ కర్ఫ్యూపై కూడా మంత్రి కేటీఆర్కు ప్రశ్నలు ఎదురయ్యాయి.. దీనిపై స్పందించిన ఆయన.. కరోనా కేసులు, వైద్యారోగ్య శాఖ సలహాల మేరకు.. రాష్ట్రంలో లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూ వంటి నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు.. అయితే, ప్రస్తుతం కర్ఫ్యూ, లాక్డౌన్ లాంటి ఆలోచనలు మాత్రం ప్రభుత్వం లేనట్టుగా తెలుస్తోంది.. కేసుల సంఖ్య మరింతగా పెరిగితే.. కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. కేసులు పెరుగుతూ పోతున్నందున.. సంక్రాంతి హాలీడేస్ తర్వాత స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు తెరుచుకుంటాయా? లేదా? అనేదానిపై ప్రభుత్వమే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.