పదవుల్లో ఉన్న అధికారుల కంటే ప్రజల బలమే ఎప్పుడూ గొప్పదని, ఆ విషయాన్ని దేశవ్యాప్తంగా విద్యార్థులు , యువత నిర్వహించిన ఉద్యమం మరోసారి నిరూపించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఎలాంటి రాజకీయ అండ లేకుండా, రాజకీయ పార్టీలకు అతీతంగా తమకు జరిగిన అన్యాయాన్నే ప్రధాన ఎజెండాగా చేసుకుని విద్యార్థులు సాగించిన ఈ పోరాటం ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. యువత చూపిన తెగువ, ఐక్యత , పోరాట పటిమ దేశానికే స్ఫూర్తిగా నిలిచాయని వ్యాఖ్యానించిన కేటీఆర్, ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించిన ‘జెన్-జీ’ (Gen-Z) యువతకు హృదయపూర్వక సెల్యూట్ తెలియజేశారు.
ప్రభుత్వాలు గుణపాఠం నేర్చుకోవాలి
యువత లేవనెత్తిన ప్రశ్నలను పట్టించుకోకుండా ప్రభుత్వాలు కేవలం రాజకీయాలకే పరిమితమైతే భవిష్యత్తులో ఇలాంటి ఉద్యమాలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని కేటీఆర్ హెచ్చరించారు. పదవుల్లో ఉన్నవారు తమ నిర్ణయాలు , తప్పులకు బాధ్యత వహించాల్సిన సమయం వచ్చిందని, విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాల్సిన అవసరాన్ని ఈ ఉద్యమం స్పష్టంగా చాటిచెప్పకనే చెప్పిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన గుణపాఠం నేర్చుకొని, యువతకు అత్యంత కీలకమైన విద్యా, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించి వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

