భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలో టీఎస్బి-పాస్ను దేశంలోనే ఆదర్శంగా నిలపాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పలు మున్సిపల్ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాల పైన మంత్రి కె. తారకరామారావు సోమవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు కీలక సూచనలు చేశారు. టీయూఎఫ్ఐడీసీ ద్వారా వివిధ పురపాలికల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పురోగతినిపురోగతిపై మంత్రి కె. తారకరామారావు అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం పట్టణాల రూపురేఖలను సమగ్రంగా మార్చేందుకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ దిశగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి నెల పురపాలికలకు ప్రత్యేకంగా నిధులను ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు.
పట్టణ ప్రగతికి అదనంగా టీయూ ఎఫ్ఐడీసీ సంస్థను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మున్సిపాలిటీలకు అందజేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టిఎస్ బి-పాస్ విధానం క్షేత్ర స్థాయిలో అమలవుతున్న తీరు పైన మంత్రి కేటీఆర్ అధికారులను అడిగి తెలసుకున్నారు. టీఎస్ బి-పాస్ తొలి దశలో కొన్ని ప్రారంభ ఇబ్బందులు ఉన్నప్పటికీ క్రమంగా దాన్ని బలోపేతం చేసినట్టు అధికారులు మంత్రికి వివరించారు. ప్రస్తుతం టీఎస్ బి-పాస్ను పౌరులు విస్తృతంగా ఉపయోగిస్తున్నారని, గణాంకాలతో వివరించారు.
టీఎస్ బి-పాస్ కి సంబంధించి అనుమతుల జారీ ప్రక్రియలో గతంలో ఉన్న ఆలస్యం పెద్ద ఎత్తున తగ్గిందని ఈ సందర్భంగా అధికారులు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. టీఎస్ బి-పాస్ చట్టంలో పేర్కొన్న అన్ని రకాల సౌకర్యాలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా పురపాలక శాఖ పని చేయాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. టీఎస్బి-పాస్ను ప్రజల వద్దకు మరింతగా చేర్చేలా అవసరమైన మార్పులను వెబ్సైట్లో చేశామని, ప్రజల ఫిర్యాదులకు సంబంధించి మరింత వేగంగా రెస్పాన్స్ ఇచ్చే విధంగా ప్రస్తుతమున్న ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను బలోపేతం చేయడం, టీఎస్ బి-పాస్ టోల్ ఫ్రీ నెంబర్ కు మరింత ప్రచారం కల్పించడం వంటి చర్యలను చేపట్టాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. పరిశ్రమల అనుమతుల ప్రక్రియలో ts-ipass మాదిరే దేశంలో భవన నిర్మాణ,లేఅవుట్ అనుమతులకు సంబంధించి టిఎస్ బి-పాస్ సైతం దేశానికి ఆదర్శంగా నిలిచే ఒక వ్యవస్థగా మార్చాలని ఈ సందర్భంగా కేటీఆర్ అధికారులకు సూచించారు.
ఈ వారంలోనే ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో భాగంగా నిర్మాణమైన మరో రెండు కీలకమైన ఫ్లైఓవర్ లను ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్రంలోని పురపాలికల మాస్టర్ ప్లాన్ తయారీ పైన మంత్రి కేటీఆర్ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాస్టర్ ప్లాన్ల తయారీ ప్రక్రియ ఇప్పటికే అనేక పురపాలికలు, అన్ని కార్పొరేషన్లలో పూర్తయిందని, నూతనంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మున్సిపాలిటిల్లో మాస్టర్ ప్లాన్ లను సాధ్యమైనంత తొందరగా పూర్తిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ అధికారులను ఆదేశించారు.