ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం వీఎం బంజర్లో కుమారుడి అంత్యక్రియల సందర్భంగా హెల్మెట్ వినియోగించాలంటూ ఓ తండ్రి చేసిన విజ్ఞప్తి అందరినీ కలచివేసింది. ఖమ్మం బస్టాండ్ సమీపంలో జనవరి 8న జరిగిన రోడ్డు ప్రమాదంలో వీఎం బంజర్ గ్రామం వద్ద సోమ్లానాయక్ తండాకు చెందిన తేజావత్ సాయి(18) తలకు బలమైన గాయం కావడంతో హైదరాబాద్లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.
అంతిమయాత్రలో ఉన్న యువకుడి తండ్రి తేజావత్ హరి తన కుమారుడి మృతితో భావోద్వేగానికి లోనయ్యారు. ఇప్పటికైనా ఈ సందర్భాన్ని సద్వినియోగం చేసుకుంటూ బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడంపై యువతలో సందేశం పంపాలన్నారు. కుమారుడి శవం పక్కనే నిలబడి చేతిలో హెల్మెట్ పట్టుకున్న హరి, ప్రమాదం జరిగిన రోజు హెల్మెట్ ధరించి ఉంటే తన కొడుకు సాయి బతికి ఉండేవాడని రోదిస్తూ హెల్మెట్ లు పంపిణీ చేశాడు.
“నా బిడ్డలాగా ఎవ్వరూ చనిపోకూడదని, బైక్ నడిపేటప్పుడు అందరూ హెల్మెట్ ధరించాలి” అంటూ.. కొడుకు మృతి చెందాడన్న బాధలో కూడా ప్రజలకు అవగాహన కల్పించేందుకు హరి ప్రయత్నించారని స్థానికులు కొనియాడారు. ఈ ఘటనను నెటిజన్లు విస్తృతంగా పంచుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.