తెలంగాణ సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా టీఆర్ఎస్ నేతలు, ఆయన అభిమానులు తెలంగాణ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. అన్ని చోట్ల కేసీఆర్ బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు చెందిన టీఆర్ఎస్ యువజన నాయకుడు అలిశెట్టి అరవింద్ ప్రత్యేక అభిమానం చాటుతూ దేశంలోనే తొలిసారిగా బోటుపై బ్యానర్ను ఆవిష్కరించారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉండే హుస్సేన్ సాగర్లో బుద్ధుడి విగ్రహం పక్కన ప్రత్యేకమైన బోటులో కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ బ్యానర్ ఏర్పాటు చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు.
అటు కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గురువారం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆలయంలో ఆయుష్షు హోమం నిర్వహించి కోటి కుంకుమార్చన ముగింపు పూజల సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు.