ప్రజల స్పందన, బిజెపి కు ఆదరణ చూసిన తరువాత ఆందోళన చెందిన సీఎం కే.సి.ఆర్ “దళితబంధు”పథకాన్ని తీసుకు వచ్చారు అని తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. అంబేద్కర్ జయంతిని గౌరవించని సీఎం దళితుల మీద “ఫేక్ ప్రేమ” చూపిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఫేక్.. ఆయన పథకాలు ఫేక్ అని తెలిపారు. హుజూరాబాద్ ఉపఎన్నికల ను దృష్టిలో ఉంచుకుని దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. “ఫేక్ ఐడి” కార్డులు, తప్పుడు ప్రచారాలు చేసే స్థాయికి దిగజారారు. కోట్ల రూపాయలు కుమ్మరించి ఎలాగైనా ఎన్నికలలో గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ కు తన పాలనపై నమ్మకం ఉంటే, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు ఎదుర్కొనాలి అన్నారు. అక్రమ పద్ధతిలో ఉపఎన్నికను గెలవాలని చూస్తున్నారు. కోట్ల రూపాయలు కుమ్మరించి బంపర్ ఆఫర్లతో ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్నారు. ప్రజలు కేసీఆర్ వ్యవహార శైలిని ఛీదరించుకుంటున్నారు. తెలంగాణ లో అభివృద్ధిని మతకోణంలో చూస్తున్నారు. హిందువులు నివసించే ప్రాంతాలలో రోడ్ల విస్తరణ పేరుతో ఇళ్ల కూల్చి వేతలకు పాల్పడుతున్నారు. పాతబస్తీలో పన్నులు కట్టకపోయినా, రోడ్లు ఇరుకుగా ఉన్నా అక్కడ కూల్చివేతలకు పాల్పడే ధైర్యం కేసీఆర్ కు లేదు. ఒక వర్గానికి ఒక న్యాయం, మరొక వర్గానికి మరో న్యాయం ఉండకూడదు. పాతబస్తీ అభివృద్ధిని టీఆర్ఎస్ , ఎంఐఎం అడ్డుకుంటున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలు ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నాయి. కేసీఆర్ , టీఆర్ఎస్ పార్టీ కి ధైర్యం ఉంటే పాతబస్తీలో రోడ్లు వెడల్పు చెయ్యాలి.