నిన్న ఉద్యోగల సమస్యల పరిష్కారానికై జాగర దీక్ష చేపట్టిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) స్పందిస్తూ బండి సంజయ్ అరెస్ట్ను ఖండిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంత్ రావు, నవాత్ సురేష్ మాట్లాడుతూ.. 317 జీవోలో సవరణలు చేయాలని శాంతియుతంగా జాగరణ దీక్ష చేపట్టిన బండి సంజయ్ను అరెస్ట్ చేయడం శోచనీయమన్నారు.
అంతేకాకుండా 317 జీవోను 8 ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి 2021 డిసెంబర్ 6న విడుదల చేశామని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. అయితే ఏ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాజకీయ లబ్ది కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. సీనియారిటీ ప్రకారం కాకుండా, స్థానికత మరియు సీనియారిటీ రెండింటి ఆధారంగా కేటాయింపులు జరపాలన్నారు. చాలా మంది ఉపాధ్యాయులు సొంత ప్రాంతానికి సూదూరంగా ఉన్న జిల్లాకు వెళ్లాల్సి వస్తోందని. వారి నివాసం, పిల్లల చదువు, వృద్ధులైన తల్లిదండ్రులు వంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని ఉత్తర్వుల్లో మార్పులు చేయాలని ఇప్పటికైనా సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.