తెలంగాణలో సంచలనం కలిగించిన బోధన్ సంఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్ రెడ్డి ,నిజామాబాద్ కమీషనర్ కే ఆర్ నాగరాజులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పరిస్థితి అదుపులో ఉందని, కమిషనర్ ఇతర పోలీసు అధికారులు బోధన్ లోనే ఉండి పరిస్థితులు సమీక్షిస్తున్నారు అని డీజీపీ మహేందర్ రెడ్డి హోం మంత్రికి వివరించారు.
ఉద్రిక్తతలకు దారి తీసిన పరిస్థితులపై హోం మంత్రి మహమూద్ అలీ ఆరాతీశారు. ఘర్షణ వాతావరణాన్ని అదుపు చేశామని డీజీపీ హోం మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ…. రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలకు, అన్ని మతాలకు సమానమైన ప్రాధాన్యత కల్పిస్తూ సెక్యులర్ నాయకుడుగా ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలకు, అన్ని మతాలకు సమానమైన గౌరవం ఉందని హోంమంత్రి అన్నారు. పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తతతో ఉన్నారని.. ప్రజలు పోలీసులకు సహకరించాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు.